'చిరంజీవి వల్ల గుర్తింపు, పవన్ కళ్యాణ్ వల్ల అధికారం'
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచారం వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, అదే సమయంలో చిరంజీవి వల్ల కాపులకు రాజకీయాల్లో తగిన గుర్తింపు లభించిందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అభిప్రాయపడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన కాపు ప్రజాప్రతినిధుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం కాపు వర్గీయులు దూడుకు స్వభావంతో, దాడులు చేసే వారిగా సమాజంలో ముద్రపడ్డారని, దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కోస్తా జిల్లాల్లోని కాపు ఓటు బ్యాంక్ వల్లే తెలుగుదేశం ఏపీలో అధికారంలోకి వచ్చిందని రామచంద్రాపురం ఎమ్మేల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. దీనిని గుర్తించే పదవిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పదవిని కాపులకు ఇచ్చారన్నారు.
రాష్ట్ర విభజన వల్ల కాపులకు మంచే జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాతే కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. రాష్ట్రం కలిసి ఉంటే కాపులను బీసీలో చేర్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. త్వరలోనే కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు.