టార్గెట్ బీజేపీ! మనమంతా ఏకమవ్వాలి: కుమారస్వామితో చంద్రబాబు భేటీ, కీలక చర్చ
Recommended Video

విజయవాడ: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కనకదుర్గమ్మ దర్శనం కోసం విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు స్వాగతం పలికారు.

కుమారస్వామితో 40నిమిషాలపాటు భేటీ
దుర్గమ్మను దర్శించుకునే ముందు విజయవాడ గేట్ వే హోటల్కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గేట్వే హోటల్లో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది.
సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిత్తూరు పర్యటనకు వెళ్తూ మధ్యలో ఆగి కుమారస్వామితో సీఎం సమావేశమయ్యారు.

అదే ఆలోచిస్తున్నాం
చంద్రబాబు-కుమారస్వామి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగా తాము కలిసినట్లు.. ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొనేవిధంగా అన్ని ఆలోచిస్తున్నామని చెప్పారు.

టార్గెట్ ఎన్డీఏనే..
ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొనిపోతామని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకురావాలని .. దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు కలవాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు. తాము మరోసారి భేటీ కావాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు.

అందుకే దుర్గమ్మ చెంతకు
కుమారస్వామి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరివెళ్తారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో కుమారస్వామి బెజకవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications