ఘోర రైలు ప్రమాదం: ఎమ్మెల్యేతోపాటు ఆరుగురు మృతి, హెల్ప్లైన్ నెంబర్లు
అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. నాందేడ్ ఎక్స్ప్రెస్రైలు- లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
లెవల్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పిన లారీ రైలు హెచ్1 బోగీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ పెనుకొండ నుంచి తాడిపత్రి వెళుతోంది. బోగీపై గ్రానైట్ రాయి పడటంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు.
మృతుల్లో ఒకరిని హెచ్1 బోగీ ఏసీ టెక్నీషియన్ అహ్మద్గా గుర్తించారు. పట్టాలపై మరో రెండు బోగీలు ఒరిగాయి. దీంతో బెంగళూరు గుంతకల్లు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కర్ణాటక ఎమ్మెల్యే మృతి
జిల్లాలోని పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద రైలు ఘటనలో నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేశ్ నాయక్ మృతి చెందారు.
సహాయక చర్యలు
మడకశిర రైలు ప్రమాద ఘటనలో అనంతపురం జిల్లా అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. సంఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే పార్ధసారథిలు పరిశీలించారు. ప్రయాణికులకు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు, ఎస్పీలను మంత్రి సునీత ఆదేశించారు.
స్వల్పంగా గాయపడిన వారికి ఘటనాస్థలంలోనే చికిత్స అందించారు. రైలు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు జిల్లా అధికారులు 22 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మంచినీరు, పాలను పంపిణీ చేశారు.
సహాయక చర్యలను జాయింట్ కలెక్టరు లక్ష్మీకాంతం పర్యవేక్షిస్తున్నారు. రైల్వే హెల్ప్లైన్ ఫోన్ నెంబర్లు : పెనుకొండ- 08555-220228, 08555- 220444, అనంతపురం- 08554- 275811, 08022156553, 09731666751.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications