సికె బాబుతో వైరం: అజ్ఞాతంలోకి మోహన్, రాజకీయాల్లోకి భార్య కటారి అనురాధ
చిత్తూరు: హత్యకు గురైన మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ మాజీ శాసనసభ్యుడు సికె బాబుకు అనుచరుడిగా ఉంటూ, ఆ తర్వాత ఎదురు తిరిగి రాజకీయాల్లో అడుగు పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాంతో భార్య అనురాధ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఫాక్షన్ ప్రతీకార చర్యల్లో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
కటారి మోహన్ చిత్తూరు నగరం గంగనపల్లెకు చెందినవారు. ఆయన 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరుడిగా ఉండేవారు. ఆ ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మోహన్ బంధువు ఏఎస్ మనోహర్ పోటీ చేశారు. దీంతో మోహన్ కాంగ్రెస్ పార్టీని వదిలి టిడిపిలో చేరారు.
Photos: మేయర్ అనూరాధ దంపతుల హత్య
2005 మున్సిపల్ ఎన్నికల్లో గంగనపల్లె పరిధిలోని 26వ వార్డు నుంచి టీడీప అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్గా గెలిచారు. అదేఏడాది డిసెంబరు 28న చిత్తూరు పట్టణంలో కన్నన్ కళాశాల సమీపంలో కటారి మోహన్పై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. మోహన్ మరణించాడని భావించి ప్రత్యర్థులు వెళ్లిపోయారు. ఈ హత్యోదాంతంలో సీకేబాబుపై కేసు నమోదైంది. ఈ సంఘటనతోనే కటారి కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిందని చెబుతున్నారు.
ఆ తర్వాత మోహన్ పట్టణం విడిచిపోయారు. ఆయన జాడ చాలా కాలం వరకు ఎవరికీ తెలియలేదు. మున్సిపల్ సమావేశాలకు డుమ్మా కొట్టడంతో మోహన్ను కౌన్సిలర్ పదవి నుంచి తొలగించారు. ఆ వెంటనే 26వ వార్డుకు ఉప ఎన్నికలు నిర్వహించారు. అప్పటికింకా మోహన్ అజ్ఞాతవాసంలోనే ఉండటంతో, ఆయన భార్య అనురాధ పోటీచేసి గెలిచారు.
ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే 2007 ఫిబ్రవరి 9న సీకేబాబుపై హత్యాయత్నం జరిగింది. మోహన్తోపాటు ఆయన కుమారుడు ప్రవీణ్, బావమరిది చింటూలపై కేసు నమోదైంది. అదే ఏడాది డిసెంబరు 30వ తేదీన చిత్తూరు పట్టణంలోని కట్టమంచి ప్రాంతంలో కల్వర్టు కింద మైన్ అమర్చి సీకే బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేశారు. ఆ సంఘటనలో కూడా సీకేబాబు ప్రాణాలతో బయటపడగా గన్మ్యాన్ ఒకరు బలయ్యారు. దీనిపై కూడా కటారి మోహన్ తదితరులపై కేసు నమోదైంది.
ఆ తర్వాత ఆరేళ్లకు 2011లో మోహన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంతకాలం జైలులో ఉండి, బెయిల్పై విడుదలయ్యారు. చిత్తూరు టీడీపీ రాజకీయాల్లో క్రియాశీలమయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో చిత్తూరు పరిధిలో మోహన్ పట్టు సాధించారు.
ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. చిత్తూరు మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయింది. భర్త ప్రోత్సాహంతో కటారి అనూరాధ గంగనపల్లె నుంచీ కార్పొరేటర్గా గెలిచారు. చిత్తూరు మేయర్ పదవిని దక్కించుకున్నారు. ఎనిమిదేళ్ల పాటు తీవ్రమైన చిక్కులను ఎదుర్కున్న కటారి కుటుంబం దీంతో నిలదొక్కుకుందని అందరూ భావించారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రశాంతత నెలకొందని కూడా భావించారు. కానీ, ఒక్కసారిగా వారికి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తే వారిపై కత్తి కట్టి, హతమారుస్తాడని ఎవరూ ఊహించలేదు.