పవన్ కల్యాణ్ ఫ్యాన్స్తో కత్తి మహేష్ రగడ: కుట్ర కోణం ఉందా?
తెలుగు సినిమాలపై కత్తిలాంటి విమర్శలు చేస్తారని భావించే కత్తి మహేష్కు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య తలెత్తిన వివాదంలో కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: తెలుగు సినిమాలపై కత్తిలాంటి విమర్శలు చేస్తారని భావించే కత్తి మహేష్కు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య తలెత్తిన వివాదంలో కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ శ్రేయోభిలాషులు ఆ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో కాలు పెట్టడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వివాదం ముందుకు రావడం అందులో భాగమేనని అంటున్నారు. చివరకు పవన్ కల్యాణ్ ఆ ఘటనపై స్పందించారు. కత్తి మహేష్ పేరు ప్రస్తావించకుండా వివాదంపై స్పందించారు.
పవన్ కల్యాణ్ ఆ సంఘటనపై సుదీర్ఘమైన వివరణే ఇచ్చారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మహేష్ కత్తి కాస్తా పాపులర్ అయ్యారు. దీంతో ఆయనను టీవీ చానెళ్లు ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాయి. ఆ తర్వాత వివాదం ప్రారంభమైంది.
పవన్ కల్యాణ్ ఇలా అన్నారు....
కత్తి మహేష్ వివాదంపై ఆయన పేరు ప్రస్తావించకుండా ఇచ్చిన సుదీర్ఘ వివరణలో పవన్ కల్యాణ్ "మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు వాళ్ల స్థాయి ఏంటో చూడండి. దాని ఇంటెన్సిటీ ఎంతో చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. అనవసరంగా ఇలాంటివాళ్లను పెంచి పెద్ద చేయడం తప్ప ఏమీ ఉండదు" అని అన్నారు. ఇది ఆయన తన అభిమానులకు ఇచ్చిన వివరణ అనేది స్పష్టంగానే అర్థమవుతోంది. అయితే, తరచి చూస్తే మహేష్ కత్తిని ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారనే అర్థాలు తీయడానికి కూడా అవకాశం ఉంది. అయితే, దానికి నేపథ్యం కూడా ఉంది.
అప్పుడలా జరిగింది...
పవన్ కల్యాణ్ సినిమాపై గతంలో మహేష్ కత్తి ఓ రివ్యూ రాస్తూ ఏకిపారేశారు. దానిపై ఆగ్రహించిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓ హోటల్లో ఆయనపై దురుసుగా ప్రవర్తించారనే ప్రచారం ఉంది. ఇది బిగ్ బాస్ షోకు మహేష్ కత్తి వెళ్లక ముందు జరిగింది. బిగ్ బాస్ ఎంట్రీలో కత్తి మహేష్పై హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలోనే స్పందించారు. కత్తిలాంటి విమర్శలు చేస్తారని అన్నారు.
బిగ్ బాస్ ఎంట్రితో కాస్తా...
మహేష్ కత్తి పేరు అంతగా ప్రచారంలో లేదు. ఆయన సన్నిహితులకు, మరికొంత మందికి పేరు తెలుసు. కొన్ని సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన పేరు ఎక్కువ వెలుగులోకి వచ్చింది. చివరకు ఆయన షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ షోకు ఉన్న ప్రాచుర్యం దృష్ట్యా టీవీ చానెళ్లు, కొన్ని మీడియా హౌస్లు ఆయనను ఇంటర్వ్యూ చేశాయి. సహజంగానే రచయిత అయిన మహేష్ కత్తి తన ఇంటర్వ్యూలను కూడా ఆసక్తికరంగా పండించారు.
ఇలా జరిగింది....
మహేష్ కత్తి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొద్ది భాగాన్ని తీసుకున్ని నెటిజన్లు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది పవన్ కల్యాణ్ అభిమానులకు వ్యతిరేకంగా ఉంది. అయితే, తాను చేసిన వ్యాఖ్యకు మహేష్ కత్తి కట్టుబడే ఉన్నారు. కొంత మంది ఫ్యాన్స్ ఉన్మాదులుగా మారుతున్నారనేది ఆయన అభియోగం. దాంతో అగ్గి రాజుకుంది.
దళితుడు కావడంతో..
మహేష్ కత్తి దళితుడు కావడంతో ఆయనకు సహజంగానే దళిత వర్గాల నుంచి మద్దతు లభించింది. కొంత దళిత రచయితలు, మేదావులు ఆయనకు మద్దతు పలికారు. దాంతో వివాదం ముదిరే సూచనలు కనిపించాయి. బిగ్ బాస్ విషయంలో కూడా కుల కోణం కూడా ముందుకు వచ్చింది. కింద కూర్చోవాలని మహేష్ కత్తికి ఒక సందర్భంలో కింద, అంటే నేల మీద కూర్చోవాలనే శిక్ష వేశాడు. మహేష్ కత్తి దళితుడు కాబట్టే ఆ శిక్ష వేశారని కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అది అంతగా ప్రాచుర్యం పొందలేదు. మొగ్గలోనే వివాదానికి తెర పడింది.
మరి ఇప్పుడు ఎందుకిలా...
పవన్ కల్యాణ్ అబిమానుల విషయంలోనే వివాదం ఎందుకు ముదిరిందనేది ప్రశ్న. పవన్ కల్యాణ్కు ఇమేజ్ అందుకు ప్రధాన కారణమని బయటకు కనిపిస్తుంది. కానీ ఆయన శ్రేయోభిలాషులు మరో కోణంలో చూస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి దాన్ని చెడగొట్టే పనికి ఆయన ప్రత్యర్థులు పూనుకున్నారని, అందులో భాగంగానే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) ఆ అనుమానమే ఫోన్లో వ్యక్తం చేశాడు.
కుట్ర ఇలా సాగుతోందని...
ఆ వివాదంపై సాఫ్ట్వేర్ ఉద్యోగి చాలా వివరంగానే మాట్లాడారు. ఇంతకు ముందు ప్రత్యర్థులు ప్రధాన నాయకుడి మనసును చెదరగొట్టే పనిచేసేవారని, ఇప్పుడు కొత్త పద్ధతి ఎంచుకున్నారని అన్నారు. ప్రత్యర్థుల అనుచరులు పవన్ కల్యాణ్ అభిమానుల గుంపులోకి ప్రవేశించి ఉంటారని, హోటల్లో జరిగిన సంఘటనను ఆసరా చేసుకుని ప్రస్తుత వివాదానికి తెర తీసి, పవన్ కల్యాణ్ను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఆ రకమైన కుట్ర ఈ వివాదంలో ఇమిడి ఉందని అన్నారు.
గోగినేని బాబు పేరిట పోస్టు...
గోగినేన బాబు పేరిట కనిపించిన పోస్టు ఆలోచించే విధంగా ఉంది. కత్తి మహేష్కు సినిమా తీయడం రాదని, కత్తి మహేష్కి సినిమా చూడడం రాదని, కత్తి మహేష్ జింకి వెళ్లడు, కత్తి మహేష్ చేసే కత్తి ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్సి) రుచి బాగోదని కూడా కామెంట్ చేశాడు. ఇది పవన్ కల్యాణ్ అభిమానుల తీరు అని ఆయన చెప్పదలుచుకుని ఆయన ఈ కామెంట్ చేశారని అనిపిస్తోంది. బిగ్ బాస్ కార్యక్రమంలో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్తో ఫ్రయిడ్ చికెన్ చేయించి, దాన్ని ఆయన కూడా రుచి చూసి, బాగుందని మెచ్చుకుంటూ దానికి కత్తి చికెన్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గోగినేని బాబు ఆ రకంగా పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్ను కించపరుస్తున్నారని చెప్పడానికి ఆ వ్యాఖ్యలు పోస్టు చేశారని అనిపిస్తోంది.
అంతటితో ఆగలేదు...
కత్తి మహేష్ బిగ్ బాస్లో నేల మీద కూర్చున్నాడు, కత్తి మహేష్ బిగ్ బాస్లో అసలు పనిచేయలేదని అన్నాడు. దానికితోడు, కత్తి మహేష్ రాజకీయ దరిద్రం, కత్తి మహేష్ వైయస్సార్ సిపిని సపోర్టు చేస్తాడని కూడా పోస్టులో వ్యాఖ్యానించాడు. పవన్ ఫ్యాన్స్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్యలను పోస్టు చేసినట్లున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులతో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన మహేష్ కత్తి అక్కడి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తారని, తన ఇమేజ్ను పెంచుకోవడానికే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్తో గొడవకు దిగుతున్నారనే ప్రచారం కూడా సాగింది.
అతను పెద్ద పోస్టే పెట్టాడు...
కత్తి మహేష్పై గోగినేని బాబు పేరిట పెట్టిన పోస్టు ఇంకా చాలా పెద్దదిగానే ఉంది. కత్తి మహేష్ను వాడు, వీడు అంటూ కూడా తూలనాడాడు. చాలా కించపరిచే పదజాలం కూడా ఉంది. ఇదంతా మహేష్ కత్తిని మరింతగా రెచ్చగొట్టడానికే జరిగిందనే అనుమానాలు ఆ పోస్టు చూస్తే రాక మానదు. అయితే,ఇది పవన్ కల్యాణ్ అభిమానుల తీరును ఆయన చెప్పడానికి ఆ విధంగా రాశాడని పోస్టు చివరి వరకు వెళ్తే అర్థమవుతుంది.
అయితే, చివరగా ఇలా...
బాబు గోగినేని పేరిట పోస్టులో తొలుత పవన్ కల్యాణ్ అభిమానులు పేరిట కత్తి మహేష్పై చేస్తున్న వ్యాఖ్యలను క్రోడీకరించి, వారి వైఖరిని ఖండించారు. చివరగా ఇలా అన్నారు - "మనకున్న అన్ని ప్రాధమిక హక్కులలో, జీవించే హక్కు తరువాత మనిషిగా జీవించే హక్కు ఇచ్చేది, అత్యంత విలువైనది, మిగతా హక్కులకు పునాది అంత ముఖ్యమైనది, భావ ప్రకటనా స్వేఛ్చ నే. మన మనస్సాక్షికి అద్దం పట్టేది ఈ స్వేచ్చనే. ఒక పుస్తకం వ్రాయడానికి కానీ, ఒక పుస్తకం చదవడానికి కానీ, ఒక బొమ్మ లేదా ఒక నాటకం వేయడానికి కానీ, ఒక సినిమా చూడడానికి కానీ, తీయడానికి కానీ, వీటన్నిటికీ ఒక రక్షణ గొడుగులా ఉండేది ఈ స్వేచ్చనే. ఈ స్వేఛ్చ చాలా నాజూకైన పువ్వు లాంటిది. దాన్ని పదిలంగా, వాడిపోకుండా చూసుకున్నంతకాలమే ప్రజా స్వామ్య విలువలు మనగలుగుతాయి. కొంత మంది మహేష్ కత్తి నుండి ఈ స్వేఛ్చను లాక్కునే ప్రయత్నం చేయడం మనందరినుండి ఈ స్వేఛ్చను లాక్కునే ప్రయత్నం కంటే భిన్నం కాదు". పవన్ కల్యాణ్ అభిమానుల పేరిట చెలరేగుతన్న వారు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం విషాదం. అయితే, కుట్రపూరితంగా కొంత మంది పవన్ కల్యాణ్ అభిమానుల పేరిట అలా చేస్తున్నారనే మాట వల్ల అంతా కొట్టుకోపోయినట్లేనని భావించాల్సి ఉంటుందా...
మహేష్ కత్తి కూడా...
వివాదంపై మహేష్ కత్తి స్పందించి వివరణ ఇచ్చారు. తనకు పవన్ కల్యాణ్ అంటే శత్రుత్వం లేదని అంటూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ స్పందించిన తీరుకు మహేష్ కత్తి ఆత్మహత్య చేసుకుంటాడనే ప్రచారం కూడా సాగింది. ఇది చివరకు పవన్ కల్యాణ్కు నష్టం జరిగే స్థితికి చేరుకుంది. అందుకే పవన్ శ్రేయోభిలాషులు కుట్ర కోణం ఉందని భావిస్తున్నారని చెప్పవచ్చు. చివరకు పవన్ కల్యాణ్ ఇచ్చిన వివరణ ద్వారా, మహేష్ కత్తి స్పందన ద్వారా వివాదం సద్దుమణిగిందని భావిస్తున్నారు.