మోడీ స్కీం: 3 గ్రామాలు కవిత దత్తత, ఆ ఊరికి చిరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలోని మూడు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద కవిత గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. కందికుర్తి, మానిక్ బండార్, అంతర్గామీ గ్రామాలను దత్తత తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలు తనకు సహకరించాలని కోరారు. సివిల్ సర్వెండ్స్ పంపకాలు ఇంకా జరగాల్సి ఉందన్నారు. ఇది మరికొంత సమయం పట్టవచ్చునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడం పైన హామీ ఇచ్చిందన్నారు.
కాగా, మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పేరుపాలెం (దక్షిణ) గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపీ నిధులతో ఈ గ్రామాన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాగునీరు, ప్రాథమిక వైద్యసేవలు, గృహసౌకర్యం, కల్పించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చిరంజీవి ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే చిరంజీవి ఈ గ్రామంలో పర్యటించి, గ్రామాభివృద్ధికి ఏం కావాలో పరిశీలించనున్నారు.
గ్రామస్తులను కలిసి సమస్యలు తెలుసుకోనున్నారు. ప్రధాని సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ఏపీలోని వివిధ గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.