డిగ్గీతో భేటీకి దూరం: టిడిపి దిశగా కావూరి? వలసలు...

కొన్నాళ్లుగా... కావూరి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి కొద్ది కొద్దిగా దూరం అవుతూ వస్తున్నారు. సీమాంధ్రలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఆయన మొగ్గు టిడిపి వైపు ఉందని అంటున్నారు. కొందరు మధ్యవర్తులు ఉభయ పక్షాల మధ్య సంప్రదింపుల ప్రక్రియ నడిపిస్తున్నారు.
బాగా సీనియర్ నేత అయిన ఆయన టిడిపిలోకి వస్తే విజయవాడ ఎంపి కేటాయించాలని ఆ మధ్యవర్తులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై టిడిపి నేతలు డైలమాలో ఉన్నారు. ఆయన తమ పార్టీలోకి రావడం వల్ల రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఆయనకు ఇవ్వాల్సి వస్తే ఏ సీటు ఇవ్వడం బాగుంటుందన్నదానిపై ఆ పార్టీలో తర్జనభర్జనలు నడుస్తున్నాయి. ఆదివారం ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కుతూహలమ్మ, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. సోమవారం వారు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన కోడుమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ కృష్ణ టిడిపిలో చేరే యోచనలో ఉన్నారు. పాణ్యం నియోజకవర్గ టికెట్ మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డికి ఖరారైంది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు టిడిపి దిశగా అడుగులు వేస్తున్నారు. శనివారం ఆయన బిజెపి నేత రఘురామ రాజుతో కలిసివచ్చి టిడిపి ఎంపీ గరికపాటి మోహన రావుతో భేటీ అయ్యారు. మరోవైపు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డితో సంప్రదింపులు జరుగుతున్నాయని, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందంటున్నారు.












Click it and Unblock the Notifications