అసంతృప్తితో డైలమా: కావూరికి రాహుల్ గాంధీ క్లాస్?
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను నిరసిస్తూ పార్టీ మారాలని ఆలోచన చేస్తున్న కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీమాంధ్ర నేత కావూరి సాంబశివరావుకు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హితబోధ చేసినట్లు తెలుస్తోంది. కావూరి సాంబశివరావు కాంగ్రెసు పార్టీలో ఉండలేనంటూ ఇటీవల ప్రకటన చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ ప్రచారం కూడా సాగింది.
ఈ నేపథ్యంలో కావూరి సాంబశివరావు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. కేంద్ర మంత్రి జెడి శీలం, తదితర నాయకులు చొరవ తీసుకుని ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ విధేయుడిగా ఉంటూ ఆరుసార్లు పార్టీ ఎంపీగా గెలిచిన మీరు ఓ ప్రాంతీయ పార్టీలో చేరాలనుకోవడం సరైన నిర్ణయం కాదని రాహుల్ గాంధీ కావూరితో అన్నట్లు తెలుస్తోంది.
విభజనకు దారితీసిన పరిస్థితులను సీమాంధ్ర ప్రజలకు వివరించి, ప్యాకేజీ గొప్పదనాన్ని వివరించి పార్టీకి అనుకూలంగా మార్చాల్సిన సీనియర్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాహుల్ అన్నట్లు సమాచారం. తాను తన నియోజకవర్గంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 71 శాతం మంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని కోరారని, అయినా, తాను ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కావూరి రాహుల్కు తెలిపారు.
ఇదిలావుంటే, కావూరి ఆదివారం తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. ఏలూరులో కావూరి చేరికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన్ను మచిలీపట్నం లేదా విజయవాడల్లో ఒక స్థానం నుంచి బరిలో దిగాలని తెలుగుదేశం నాయకులు సూచిస్తున్నారు.