నోర్ముయ్యాలా?: కావూరి, సుష్మకు జగన్ 25 సీట్ల ఆఫర్
తాము కేబినెట్ భేటీలో తీవ్ర ఆక్షేపణ చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పోకడలు భరించలేకే తాము వెల్లోకి వెళ్లి నిరసన తెలిపామన్నారు. రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు, దేశం ఏమైనా ఫర్వాలేదు వెల్లోకి మాత్రం వెళ్లొద్దనేది బిజెపి సిద్ధాంతమైతే తాను ఏమీ చేయలేనని ఎద్దేవా చేశారు. హైదరాబాదను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే కొత్త రాష్ట్రంలో మౌలిక వసతుల సదుపాయాలకు సమయం ఉంటుందని తాము భావించామన్నారు.
ఈ రోజు యూపిఏ ఆంధ్రప్రదేశ్ను విభజించినట్లే రేపు అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కర్నాటకను విభజిస్తారని విమర్శించారు. సొంత పార్టీలో ఉన్నంత మాత్రాన నోరు మూయాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన సమాఖ్య స్ఫూర్తికి చెంప పెట్టు అన్నారు. తమకు తెలంగాణ ముసాయిదా బిల్లుకు సంబంధించిన ప్రతులు ఇచ్చి సమయం ఇవ్వకుండానే చర్చిస్తారా అని ప్రశ్నించారు. సెంటిమెంటుతో రాష్ట్రాలు విభజిస్తే దేశం ముక్కలవుతుందన్నారు. ఇష్టమొచ్చినట్లుగా కేంద్రం విభజన చేస్తోందని దుయ్యబట్టారు.
ప్రధాని 'టి' విందు
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు బుధవారం విందు ఇచ్చారు. ఈ విందుకు బిజెపి నేతలు అద్వానీ, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, ఆంటోనీ, చిదంబరం తదితరులు హాజరయ్యారు. రేపు లోకసభలో బిల్లు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో మద్దతు కోరే ఉద్దేశ్యంలో భాగంగా ప్రధాని లంచ్ ఏర్పాటు చేశారు.
సుష్మా స్వరాజ్కు జగన్ ఆఫర్?
సమైక్యాంధ్రకు మద్దతు కూడగడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్కు ఆఫర్ ఇచ్చారట. తెలంగాణ ముసాయిదా బిల్లుకు మద్దతివ్వవద్దని కోరుతూ అద్వానీని కలిసిన అనంతరం జగన్.. సుష్మతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తోడ్పడితే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని సూచించారట. తమ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 25 పార్లమెంటు స్థానాలు వస్తాయని, తెలంగాణ బిల్లుకు సహకరించకుంటే పొత్తుకు సిద్ధమని చెప్పారట.