కేంద్రం ఆలోచనలో మార్పు తెస్తాం: విభజనపై కావూరి
తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తమకు పార్టీ సర్వస్వమే గానీ అంతకన్నా ప్రజలే ముఖ్యమని చెబుతామని ఆయన అన్నారు. ప్రజలు లేకుండా తాము లేమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షకు భిన్నంగా తాము పదవులకు అంటిపెట్టుకోవాలని ఎవరమూ అనుకోవడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గతంలో చేసిన దీక్ష నటన మాత్రమేనని తాము చెప్పామని, కెసిఆర్ చనిపోతారనే సమాచారంతో 2009లో కేంద్రం విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిందని ఆయన అన్నారు.
2009 ప్రకటనతో రాష్ట్రం నష్టపోయిందని, మరోసారి జులై 30వ తేదీ ప్రకటనతో మరింత నష్టపోయిందని ఆయన అన్నారు. విభజనపై మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ తమకు చెప్పినట్లు కావూరి తెలిపారు. విభజనను వ్యతిరేకించడంలో తాము ఏకతాటిపై ఉన్నట్లు తెలిపారు. అధికార కాంక్ష తమలో ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే పరిష్కారమని తాము సోనియాకు చెబుతామని అన్నారు. ఆంటోనీ కమిటీ ఎదుట తమ వాదనలు వినిపించామని అన్నారు. రాష్ట్రానికి రావాలని ఆంటోనీ కమిటీని కోరామని చెప్పారు. తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే ఢిల్లీ నాయకులందరినీ కలుస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు ఊసెత్తలేదు. అయితే, తాము చర్చించిన విషయాలను ఇప్పుడే మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు చెబుతామని కేంద్ర మంత్రి జెడి శీలం అననారు. ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి రప్పిస్తామని ఆయన అన్నారు. ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి రప్పించి, ఎన్జీవోల మాటలను ఆంటోనీకి వినిపిస్తామని చిరంజీవి చెప్పారు.