కాంగ్రెస్లో కొనసాగడంపై డైలమాలో ఉన్నా కానీ: కావూరి
ఏలూరు: కాంగ్రెసు పార్టీలో కొనసాగడంపై తాను ఇప్పటికీ డైలమాలోనే ఉన్నానని కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నలభై ఏళ్లుగా కాంగ్రెసులో ఉన్నానని, పార్టీ వీడాలంటే అంత సులభం కాదన్నారు. విభజన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. ఇప్పటికీ సీమాంధ్ర ప్రాంత నేతలను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
విభజన సమస్య పెద్దదని, అన్నింటికి రాజీనామా సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ జరగకనే సమస్య ఏర్పడిందని చెప్పారు. పోలవరానికి ఎలాంటి అడ్డంకులు లేనివిధంగా తెలంగాణ బిల్లులో స్పష్టంగా ఉందని చెప్పారు. గుంటూరు - ఏలూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

మౌలిక సదుపాయాల దృష్ట్యా గుంటూరు - విజయవాడ మధ్య కొత్త రాజధాని అయితే బాగుంటుందని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం లేనందువల్లే రాష్ట్రపతి పాలన విధించారన్నారు. విభజన బిల్లును పార్లమెంటులో దొంగల్లా పెట్టారన్నారు. బిజెపి, కాంగ్రెసు పార్టీలు కలిసి విభజన చేశాయన్నారు.
సొంత ప్రయోజనాల కోసమే: పనబాక
సొంత ప్రయోజనాల కోసమే కొందరు నేతలు కాంగ్రెస్ను వీడుతున్నారని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పార్టీని వీడే వారికి సిద్ధాంతాలేవీ ఉండవన్నారు. వారికి ప్రజాప్రయోజనాల కన్నా గెలుపే ముఖ్యమని విమర్శించారు. విభజన అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అన్నారు.












Click it and Unblock the Notifications