వాటర్ గ్రిడ్: మోడీ అంగీకారానికి కెసిఆర్ ఎదురుచూపులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఎదురు చూస్తోంది. పైలాన్ను ఆవిష్కరించడానికి మోడీ అంగీకారం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎదురు చూస్తున్నారు.
నిజానికి, ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవల ఇంటేక్ వెల్స్ పనులు మొదలయ్యాయి. అయితే, పైలాన్ ఆవిష్కరణ మాత్రం మోడీ కోసం ఎదురు చూస్తోంది.
నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో మూడు ఎకరాల స్థలంలో 1.5 కోట్ల వ్యయంతో భారీ పైలాన్ నిర్మాణం జరిగింది. అయితే, గత మూడు నెలలుగా దాని ఆవిష్కరణను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆపి పెట్టారు. మోడీని ఈ పైలాన్ ఆవిష్కరణ కోసం రప్పించి, 40 వేల కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు 8 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కోరాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నట్లు సమాచారం.
2019 ఎన్నికల లోగా దాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో కెసిఆర్ ఉన్నారు. అయితే, దానికి నిధుల సమీకరణ క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే 2019 ఎన్నికల్లో తాను ప్రజలను ఓట్లు అడగబోనని పలుమార్లు ముఖ్యమంత్రి అన్నారు.
ప్రాజెక్టుకు 25 వేల కోట్ల రుణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. దానికి మరో 15 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ముఖ్యమంత్రి దానికి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీని ఆశిస్తున్నారు.
గుజరాత్ వాటర్ గ్రిడ్ నమూనాలో ఉన్నందున దాన్ని ఆవిష్కరించడానికి మోడీ తప్పకుండా వస్తారని కెసిఆర్ భావిస్తున్నారు. విదేశీ పర్యటన నుంచి రాగానే మోడీని కలవడానికి కెసిఆర్ ఢిల్లీ వెళ్తారని సమాచారం. మిషన్ కాకతీయ పథకం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని పలుమార్లు ఆహ్వానించింది. అయితే, అది ఫలించలేదు. ఈ స్థితిలో వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణకు మోడీ వస్తారా, రారా అనేది వేచి చూడాల్సిందే.