ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ - అదే మేము కోరుకొనేది : వైసీపీ ముఖ్యనేతలు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పై ఏపీ అధికార పార్టీ వైసీపీ ముఖ్య నేతలు స్పందించారు. కేసీఆర్ ఏపీలో ఎటువంటి ప్రభావం చూపుతారనే అంశం పైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. కేసీఆర్ ఏపీలో త్వరలో పర్యటన ఉంటుందని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను ఆహ్వానించాల్సిందేనని చెప్పారు. కొత్త పార్టీల విషయంలో వర్రీ కావాల్సిన అసవరం లేదని ధీమా వ్యక్తం చేసారు.
ఏపీ ప్రజలు వైసీపీని ఓన్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఏ పార్టీని ఆదరిస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. తమ రాజకీయంగా ఇతర పార్టీల కంటే ముందున్నామని.. ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. రాజకీయాల కోసం ఎత్తుగడలు వేసే పార్టీ తమది కాదని విశ్లేషించారు. పొరుగు రాష్ట్రాల రాజకీయాల గురించి తాము రియాక్ట్ కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు ఏం చేశామనే దాని పైనే పార్టీల మనుగడ ఉంటుందని సజ్జల చెప్పుకొచ్చారు. సీనియర్ మంత్రి బొత్సా ఇదే అంశం పైన రియాక్ట్ అయ్యారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకోవటం ఆ పార్టీ నేతల ఇష్టమని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ వస్తే ఇప్పుడు ఉన్న పార్టీల్లో ఒకటవుతుందని విశ్లేషించారు. ఎన్నికల్లో ఎంత మంది పోటీలో అంత మంచిదని చెప్పుకొచ్చారు.
వైసీపీ పైన బీఆర్ఎస్ ప్రభావం ఉండదని బొత్సా తేల్చి చెప్పారు. ఇదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్ర పైన సీరియస్ అయ్యారు. రైతుల ముసుగులో టిడిపి, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు చేస్తుందే అమరావతి పాదయాత్రంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏమి ఉద్ధరించడానికి పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. వారికి తాము ఎందుకు సహకరించాలని ప్రశ్నించారు. అమరావతి భూముల్లో టిడిపి నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. టిడిపి నాయకులు ఎంత దోచుకున్నారో శాసనసభ సాక్షిగా వెల్లడించామని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై టిడిపి తో చర్చకు సిద్దమని బొత్సా స్పష్టం చేసారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావటం ఖాయమని.. న్యాయ పరమైన సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని మంత్రి తేల్చి చెప్పారు.