ఆర్బీఐ నో అన్నా కేసీఆర్, బాబు ముందుకే: కాంగ్రెస్ ఫైర్
హైదరాబాద్: రుణమాఫీ, రీషెడ్యూల్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆర్బీఐ నుండి చుక్కెదరైన విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు రాష్ట్రాలు వీటి విషయంలో వెనక్కి తగ్గకూడదనే కృతనిశ్చయంతో ఉన్నాయట. ఆర్బీఐ గవర్నర్ మాటలకు భయపడవద్దని రైతులకు ఈ రెండు ప్రభుత్వాలు సూచించాయి.
కేవలం పై-లిన్ తుఫాను కారణంగానే తాము రైతు రుణమాఫీలు చేయడంలేదని, గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించడంలేదని, అందుకే రుణమాఫీ చేయాలని నిర్ణయించామని అంటున్నాయి. త్వరలోనే పైలిన్ తుఫాను వల్ల నష్టపోయిన పంటల ఫోటోలు, వీడియోలు చూపించి ఆర్బీఐను ఒప్పిస్తామని తెలంగాణ సర్కారు చెబుతోంది.
రఘురామ్ రాజన్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆర్బీఐకి ఇప్పటికే ఓ ఘాటు లేఖను కూడా పంపించిందట. గత సంవత్సరం వచ్చిన ఒక్క పైలిన్ తుఫాను గురించే ఆర్బీఐ ఎందుకు మాట్లాడుతుందని ఈ లేఖలో టీడీపీ సర్కార్ ప్రశ్నించింది.
గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో సకాలంలో ఎప్పుడూ వర్షాలు పడలేదని ఈ లేఖలో పేర్కొంది. వరుస తుఫానులు కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రైతులకు తీవ్రమైన కష్టాలను మిగిల్చాయని తెలిపింది. 2010 లైలా తుఫాను, 2011లో వర్షాలు పడక రాష్ట్రంలో తీవ్రమైన కరువు వచ్చిందని, 2012లో నీలం తుఫాను, 2013లో ఫైలిన్ తుఫానుతో పాటు లెహర్, హెలెన్ తుఫానులు రాష్ట్రంలోని రైతులకు కన్నీరు మిగిల్చిందని పేర్కొంది.
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆగ్రహం
ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యల పైన తెలంగాణ కాంగ్రెసు పార్టీ మండిపడింది. ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, ఇరు రాష్ట్రాల సీఎంను అవమానపర్చేలా ఉందన్నారు. ఆయన పరిధి దాటి మాట్లాడుతున్నారని విమర్శించారు. రఘురాం రాజన్ వ్యాఖ్యల వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తం ఉందనే అనుమానం వారు వ్యక్తం చేశారు.