రాజభవన్: చంద్రుల మరో భేటీకి ముహూర్తం కుదిరింది
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మధ్య భేటీకి ముహూర్తం కుదిరింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్లో వారిద్దరి మధ్య సమావేశం జరగనుంది. 48 గంటల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారు.
గవర్నర్ నరసింహన్ సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల స్పీకర్లు, ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు సమావేశం జరుగనుంది.
విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో వివాదాలు చోటు చేసుకోగా అవి పరిష్కారం కాలేదు. దీంతో చర్చలకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజ్భవన్లో జరిగిన ఎట్హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రులు ఇద్దరు కలిశారు. గవర్నర్ మరింత చొరవ తీసుకుని వివాదాస్పద అంశాలపై ముఖ్యమంత్రులు ఇద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
గవర్నర్ సలహా మేరకు ఇరువురు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ సమావేశమై వివాదాస్పద అంశాలపై కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోతాయని భావిస్తున్నారు.
భేటీ సంతోషకరం: అశోక్ గజపతి రాజు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ కావడం సంతోషకరమైన పరిణామమని కేంద్ర మంత్రి పి. అశోక్ గజపతి రాజు అన్నారు. శనివారం ఉదయం ఆయన లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టుపై తాము ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశామని, ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై సమస్యలను పరిష్కరించుకోవాలని రాజ్నాథ్ సూచించారని ఆయన చెప్పారు. తెలుగువారికి మంచి జరిగితే మరింత సంతోషిస్తానని అశోక్ గజపతి రాజు అన్నారు