ఐటీ దాడుల ఎఫెక్ట్: కేబినెట్లో కీలక నిర్ణయం, కేసీఆర్పై బాబు స్పందన, 'జీఎస్టీ ఎగవేతవల్లే దాడులు'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ శుక్రవారం రాత్రి ముగిసింది. సుదీర్ఘంగా భేటీ జరిగింది. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు, చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు, తాజా రాజకీయ అంశాలు తదితర అంశాలపై చర్చించారు.
కేంద్రంపై అన్ని స్థాయిల్లో పోరాటం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, ఆదాయపన్ను శాఖ అధికారులకు (ఐటీ ఆఫీసర్స్) సెక్యూరిటీ ఇవ్వకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోదాలకు వచ్చే వారికి సెక్యూరిటీ అవసరం లేదని లా సెక్రటరీ తేల్చి చెప్పారు. ఐటీ దాడులపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.
ఐటీ దాడి ఎఫెక్ట్: ఐటీ ఆఫీసర్లకు నో సెక్యూరిటీ, సుప్రీం కోర్టుకు.. బాబు సంచలన నిర్ణయాలు!
ఇంతమంది ఒకేసారి మొదటిసారి
రాజకీయ కుట్రలో భాగంగానే దాడులు జరుగుతున్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇది మోడీ దాడి అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. 200 మంది సభ్యులతో కూడిన పంతొమ్మిది బృందాలు ఏపీకి రావడం ఇదే తొలిసారి అన్నారు. రాష్ట్రంపై కేంద్రం దాడిగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. కర్ణాటక, తమిళనాడులో ఈ తరహా రాజకీయం చేసిన మోడీ, ఇప్పుడు ఏపీ అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేక దాడులు చేయిస్తున్నారని కేబినెట్లో అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు, బాబ్లీ కేసుపై తర్జన భర్జన
అలాగే, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగింది. కేసీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల ప్రజల్లో చంద్రబాబుపై సానుభూతి వ్యక్తమవుతోందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై చర్చించారు. శనివారం ఉదయం అడ్వోకేట్ జనరల్, సీనియర్ మంత్రులతో చర్చించి నిర్ణయించనున్నారు. కోర్టుకు వెళ్తే ర్యాలీతో వెళ్లాలని మంత్రి అచ్చెన్న సూచించగా, వారెంట్ రీకాల్ చేయకపోతే ఎలా అని మంత్రి యనమల ప్రశ్నించారు.
ఇవి సహా పలు సంస్థల్లో సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. 28 చోట్ల తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, హైదరాబాదులలోని పలు కంపెనీల్లో సోదాలు చేశారు. సదరన్ కన్స్ట్రక్షన్, వీఎస్ లాజిస్టిక్స్, శుభగృహ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. పెట్టుబడులు, బోగస్ కంపెనీలు, అక్రమ లావాదేవీలపై ప్రత్యేక బృందాలు పోకస్ చేశాయి. కంపెనీలకు సంబంధించిన పెద్దలను ప్రశ్నించారు. ఆదాయ పన్ను ఎగవేత తదితర వివరాలపై ఆరా తీశారు.
తక్కువ ఐటీ కట్టడం, జీఎస్టీ ఎగవేతపై దాడులు
వివిధ సంస్థల కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఐటీ అధికారులు బృందాలుగా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. చెల్లించాల్సిన దానికంటే తక్కువ ఐటీ కట్టడం సహా చాలా సంస్థలు జీఎస్టీని ఎగవేస్తున్నాయనే ఆరోపణలతో దాడులు జరిగాయని సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడుల తరహాలో ఏపీలోనూ జరగొచ్చని సీఎం... మంత్రులను హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఏఏ కంపెనీల్లో సోదాలు అంటే?
గుంటూరులో పలు చోట్ల దాడులు జరిగాయి. విఎస్ ఇంజినీరింగ్ ప్రయివేటు లిమిటెడ్ సహా మరో మూడు ఆక్వా సంస్థలపై దాడులు నిర్వహించారు. విజయవాడలో మూడుచోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్కు చెందిన సదరన్ డెవలపర్స్, కనస్ట్రక్షన్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ ప్రతినిధుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. జగ్గయ్యపేటలో ఉన్న ఫ్రీ కాస్ట్ ఇటుకల తయారీ పరిశ్రమలో సోదాలు జరిగాయి. విశాఖపట్నంలోని శుభగృహ కంపెనీల్లో తనిఖీలు చేశారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావుకు సంబంధించిన సంస్థల్లో సోదాలు జరిగాయి.