'పోలవరం'పై అప్పుడే: మోడీపై కెసిఆర్, బాబు రావొచ్చు
న్యూఢిల్లీ: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకురావాలనే యోచన ఏమాత్రం సరికాదని, దీనిని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేరని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నారు.
విభజన బిల్లు పైన రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అది చట్టమైందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు చేయాలంటే ఇరు రాష్ట్రాల శాసన సభలు తీర్మానం చేయాలన్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న బార్డర్ను మరో రాష్ట్రంలో కలుపవద్దన్నారు. ఆర్డినెన్స్ తీసుకు వస్తే దీనిపై తాము న్యాయపరంగా పోరాడుతామన్నారు.
పోలవరం ముంపు ప్రాంతాలని ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకు రావాలనే యోచన ఏమాత్రం సరికాదన్నారు. ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం సరికాదన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఇలాంటి ఆర్డినెన్స్ తీసుకు వస్తే అది సరికాదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలిపితే కోర్టులో చెల్లదన్నారు. ముంపు ప్రాంతాలను తగ్గించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ప్రాజెక్టు పైన ఒడిశా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందన్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ కూడా వ్యతిరేకిస్తుందన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని కానీ, ప్రస్తుత డిజైన్ మార్చాలని చెబుతున్నామన్నారు. దేశంలో భూకంపం వచ్చే అవకాశమున్న పదకొండు ప్రాంతాల్లో పోలవరం రెండో స్థానంలో ఉందన్నారు. పోలవరం నీటి సామర్థ్యం పైన తాము అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని, డిజైన్ మాత్రమే తప్పన్నారు. ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెస్తే పోరాడుతామన్నారు.
చంద్రబాబుపై...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వార్ రూం వ్యాఖ్యలపై కెసిఆర్ మండిపడ్డారు. చంద్రబాబు ఒత్తిడిలో ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తాను ఒత్తిడిలో లేనన్నారు. చంద్రబాబు వార్ రూంకు వస్తే తాము సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు.
ఎన్నికల వరకే రాజకీయాలు: కెటిఆర్
ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఇప్పుడు అభివృద్ధే ప్రధాన అజెండా అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు కెటిఆర్తో భేటీ అయ్యారు. వారు పలు సమస్యలను కెటిఆర్ ముందు లేవనెత్తారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి తగువిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో పారిశ్రామికవేత్తలతో కెసిఆర్ సమావేశమవుతారని చెప్పారు.
జూన్ 2న కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. హైదరాబాదుకు 420 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. హైదరాబాదు ఒక్కరోజులో అభివృద్ధి చెందలేదన్నారు. కొందరు తామే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. పరిశ్రమలకు హైదరాబాద్ అత్యంత అనుకూలమన్నారు. దక్షిణ భారతదేశంలో హైదరాబాదును మించిన నగరం లేదన్నారు. కేంద్రంలో యూపిఏ ఉన్న సమయంలో గుజరాత్ను మోడీ అభివృద్ధి చేసినప్పుడు తాము తెలంగాణను చేయలేమా అన్నారు.












Click it and Unblock the Notifications