బీఆర్ఎస్ లోకి గంటా - మాజీ జేడీ : విశాఖ కేంద్రంగా ..!?
టీడీపీ ఎమ్మెల్యే గంటా, సీబీఐ మాజీ జేడీకి బీఆర్ఎస్ ను ఆహ్వానం అందింది. వారిద్దరి నిర్ణయం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది. కాపు - బలిజ నేతల పైన ఫోకస్ చేసింది. ఇప్పటికే జనసేనలో కీలక నేతగా పని చేసిన తోట చంద్రశేఖర్ కు ఏపీ పగ్గాలు అప్పగించింది. ఏపీలో కీలకంగా ఉన్న ఇతర ప్రముఖుల పైన ఇప్పుడు ఫోకస్ పెట్టింది.
అందుకు వ్యూహాత్మకంగా ఏపీ నేతలతో సత్సంబంధాలు ఉన్న నేతలను రంగం లోకి దించుతోంది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా.. సీబీఐ మాజీ జేడీకి బీఆర్ఎస్ ను ఆహ్వానం అందింది. ఇప్పుడు ఈ కొత్త పరిణామం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.
బీఆర్ఎస్ లోకి గంటా - మాజీ జేడీలకు ఆహ్వానం
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఎంపిక చేసుకున్న నేతలతో ఆ పార్టీ ముఖ్యులు మంతనాలు ప్రారంభించారు. ఏపీలో కొంత మంది నేతలను బీఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది. ప్రస్తుతం ఉన్న పార్టీలో మనస్పూర్తిగా కొనసాగలేని వారు.. రాజకీయంగా సరైన వేదిక కోసం నిరీక్షిస్తున్న వారిని ఎంచుకుంటోంది.
అందులో భాగంగా ప్రధానంగా కాపు, బలిజ వర్గాలకు చెందిన నేతల పైన ఫోకస్ పెట్టింది. ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్ కు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. విశాఖ వేదికగా ఈ ఇద్దరు నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ద్వారా ఈ ఆహ్వానం అందుకున్నారు.
అయితే, ఇద్దరు నేతలు మాత్రం దీనిని నిర్దారించటం లేదు. తమ మధ్య సాధారణ భేటీనే జరిగిందని చెబుతున్నారు. ఇద్దరు నేతలు విశాఖ కేంద్రంగా ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారిన వేళ..ఆ ఇద్దరినే బీఆర్ఎస్ ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇద్దరు నేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమావేశం
టీడీపీ మాజీ..ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ విశాఖలో ప్రత్యక్ష మయ్యారు. అక్కడే టీడీపీ ఎమ్మెల్యే గంటా.. సీబీఐ మాజీ లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. గంటా ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నా.. పార్టీ వ్యవహారాల్లో మాత్రం యాక్టివ్ గా లేరు. ఆయన పార్టీ వీడుతారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది.
ఈ మధ్య కాలంలోనే తాను టీడీపీలోనే కొనసాగుతానని గంటా క్లారిటీ ఇచ్చారు. అయినా గంటా తీరు పైన సొంత పార్టీ సీనియర్లు అయ్యన్న లాంటి వారే కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయ్యన్న తన పైన చేసిన వ్యాఖ్యల వెనుక పార్టీ ముఖ్యులు ఉన్నారని గంటా సందేహిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రావటం..ఆయనతో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారుతోంది.
విశాఖ కేంద్రంగా ఇప్పుడు వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయం కొనసాగుతోంది. ఇదే సమయంలో కొంత కాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఏపీ కాపు నేతల్లో గంటా కీలకంగా ఉన్నారు. తాజాగా కాపు నేతల సమావేశంలోనూ బీఆర్ఎస్ గురించి చర్చకు వచ్చింది.
మాజీ జేడీ ఎంట్రీ కోరుకుంటున్న బీఆర్ఎస్
ఏపీ బీఆర్ఎస్ లో సీబఐ మాజీ లక్ష్మీనారాయణ ఎంట్రీ మేలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పటికే బీఆర్ఎస్ నేతల నుంచి ఆహ్వానం అందినట్లుగా ప్రచారం లో ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయిన లక్ష్మీనారాయణ..వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు.
ఈ సమయంలోనే ఆయనకు బీఆర్ఎస్ ను ఆహ్వానం అందుతోది. తాజాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకాతో భేటీ గురించి లక్ష్మీనారాయణ స్పందించారు. వివేకా విశాఖకు రావటంతో తన నివాసానికి వచ్చారని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రాధాన్యత లేదని వివరించారు.
అయితే, గంటా -మాజీ జేడీ విశాఖ కేంద్రంగా ఏ అడుగు వేసినా రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. త్వరలోనే విశాఖ కేంద్రంగా బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఇక, ఈ ఇద్దరి నేతల రాజకీయ అడుగులు ఏంటనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.