పక్క రాష్ట్రంతో చిక్కులు, బంగారు దత్తన్న దూత: కెసిఆర్
హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇబ్బందులుంటాయని, పక్క రాష్ట్రంతో ఇబ్బందులున్నాయని, ఈ స్థితిలో దూతగా వ్యవహరించడానికి బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి ఉపయోగపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. బండారు దత్తాత్రేయకు శనివారం తెలంగాణ ప్రభుత్వం తరఫున పౌర సన్మానం జరిగింది. ఈ పౌర సన్మాన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కేంద్రంలో తెలంగాణ గొంతు లేదనే లోటు దత్తాత్రేయ వల్ల తీరిందని ఆయన అన్నారు.
తన దృష్టిలో బండారు దత్తాత్రేయ బంగారు దత్తాత్రేయ అని ఆయన అన్నారు. దత్తాత్రేయను సన్మానించడమంటే తెలంగాణను గౌరవించుకోవడమేనని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దత్తాత్రేయ సహాయాన్ని కోరుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి కేంద్ర మంత్రిగా దత్తాత్రేయ పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.
అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణ కోసం దత్తాత్రేయ అందరినీ ఏకం చేశారని, ఆ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నానని కెసిఆర్ అన్నారు. దత్తాత్రేయ మృదుస్వభావి అని, సౌమ్యుల అని ఆయన ప్రశంసించారు.

కెసిఆర్ ఉదారవాది
తనకు జరిగన సన్మాన సభలో దత్తాత్రేయ ప్రతిస్పందన వినిపించారు. తనది రాజకీయ కుటుంబం కాదని, తాను రాజకీయాల్లోకి రావడానికి రామారావే కారణమని ఆయన అన్నారు. హైదరాబాదులోని సనత్నగర్లో కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తెలంగాణకు తొలి కానుకగా అందిస్తానని ఆయన చెప్పారు. కెసిఆర్ది ఉదార స్వభావమని, కెసిఆర్ తనకు సన్మానం చేయడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం అందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కెసిఆర్ కూడా అర్థిక మంత్రిగా పనిచేసఆరని ఆయన చెప్పారు. కార్మికుల హక్కుల కోసం తాను పోరాడుతానని ఆయన చెప్పారు. విద్యుత్తు సమస్య పరిష్కారానికి తాను కెసిఆర్ను ప్రధాని మోడీతో కలిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణకు, కేంద్రానికి మధ్య తాను సంధానకర్తగా పనిచేస్తానని చెప్పారు.
దత్తాత్రేయ అజాతశత్రువు
దత్తాత్రేయను తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అభివర్ణించారు. దత్తాత్రేయ కేంద్రానికీ రాష్ట్రానికీ మధ్య సంధానకర్తగా ఉంటారనే పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు వాటాను ఇప్పించడానికి బండారు దత్తాత్రేయ ప్రయత్నించాలని ప్రతిపక్ష నేత, కాంగ్రెసు నాయకుడు కె. జానా రెడ్డి కోరారు. దత్తాత్రేయ సన్మాన సభలో బిజెపి శాసనసభా పక్ష నేత లక్ష్మణ్, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కూడా ప్రసంగించారు. మంత్రులు, శాసనసభ్యులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications