101 హామీల్లో మూడే చేశారు: కేసీఆర్ హామీల చిట్టా విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల సమయంలో 101 హామీలు ఇచ్చి, ఇప్పటి వరకు 3 మాత్రమే నెరవేర్చారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ బుధవారం మండిపడ్డారు.
ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల చిట్టాను తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడారు. ఇచ్చిన 101 హామీల్లో మూడు మాత్రమే అమలు చేశారని చెప్పారు. మిగతా వాటి సంగతేమిటని ప్రశ్నించారు.
చంద్రబాబుపై రసమయి మండిపాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరీంనగర్ పర్యటనపై రసమయి బాలకిషన్ స్పందించారు. తాము తలుచుకుంటే కరీంనగర్ నుంచి చంద్రబాబు తిరిగి వచ్చేవారు కాదనన్నారు. తెలంగాణ గడ్డపై విచక్షణారహితంగా మాట్లాడితే ఆయన్ని ఇంటి గడప తొక్కకుండా చేస్తామని హెచ్చరించారు.
ఏపీ సచివాలయం ముట్టడికి తెలంగాణ లాయర్ల యత్నం
తెలంగాణ న్యాయవాదులు బుధవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. హైకోర్టు విభజనకు ఏపీ సర్కారు సహకరించడం లేదని ఆరోపించారు. ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా న్యాయశాఖను ఏర్పాటు చేసి విడిగా నియామకాలు చేపట్టాలన్న డిమాండ్తో చలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చారు. కాగా, న్యాయవాదులు సచివాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న భద్రతా దళాలు, కొందరిని అరెస్ట్ చేశారు.