వారు తెలంగాణకే: కేటాయింపులపై కెసిఆర్ హ్యాపీ
హైదరాబాద్: ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పలువురు సమర్థ అధికారులు వచ్చారని ఆయన భావిస్తున్నారు. కేటాయింపులపై తాను ఎంతో ఉత్కంఠకు గురయ్యానని, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్ లాంటివారు తెలంగాణ రావడం ఆనందదాయకమని కెసిఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
మరి కొందరు అధికారుల మార్పిడి కోసం ప్రధాని నరేంద్ర మోడీని కోరాలని ఆయన నిర్ణయించుకున్నారు. అధికారుల మార్పిడిపై అవగాహన కోసం త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యేందుకు కెసిఆర్ సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో బుధవారం కెసిఆర్ తన పేషీ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, డిజిపి అనురాగ్ శర్మ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఉన్న సిఎస్ రాజీవ్ శర్మ అధికారుల విభజన ప్రక్రియ గురించి కెసిఆర్కు ఫోన్లో వివరించారు.
తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మరికొందరు అధికారులు ఎపికి వెళ్లారని, వారిని ఇక్కడికి మార్చాలని ప్రధానిని కోరుదామని ముఖ్యమంత్రి చెప్పారు. ముందే మార్పిడి సాధ్యం కాకపోతే కేటాయింపులపై అధికారుల ఉత్తర్వుల తర్వాత డిప్యుటేషన్లు కోరాలనే ప్రతిపాదన మీద కూడా చర్చించారు.












Click it and Unblock the Notifications