ప్రాణం పోయినా ఇవ్వం, అందుకే సర్వే, ఒత్తిడి: కేసీఆర్
హైదరాబాద్: ప్రాణం పోయినా తమ ప్రభుత్వం అనర్హులకు పింఛన్లు, ఇళ్లు కట్టివ్వదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. హౌస్ హోల్డ్ సమగ్ర సర్వే పైన కేసీఆర్ సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని అంశాల పైన అవగాహన ఉండాలన్నారు. అంతా కలిసి చిత్తశుద్దితో పని చేస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. ప్రతి పనికి ఒక లక్ష్యం, గమ్యం ఉండాలన్నారు.
ప్రతి ఇంటి సమాచారాన్ని సేకరించాలన్నారు. ఒక్కరోజులోనే ఈ సమాచారం సేకరించాలన్నారు. ప్రజలు ప్రభుత్వాల పైన అసహనంతో ఉన్నారన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తన పంతాను, మార్గాన్ని నిర్దేశించుకుందని చెప్పారు. ప్రతి పనికి గమ్యం, లక్ష్యం ఉండాలన్నారు. ఇప్పుడు చేసే ప్రతి ఇంటి సమాచారం సర్వే పక్కాగా, పకడ్బంధీగా ఉండాలన్నారు. ఇన్నాళ్ల పాలనలో ఆశించిన స్థాయిలో పేదరిక నిర్మూలన జరగలేదన్నారు.
ఇప్పటి వరకు జరిగిన సర్వేలు పూర్తి పంథాలో లేవన్నారు. అన్ని అంశాల పైన అవగాహన లేదన్నారు. సరైన లెక్కలు లేని కారణంగా భారీ అక్రమాలు జరిగాయన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటి సమాచారాన్ని ఒక్కరోజులో ఉదయం నుండి సాయంత్రం వరకు చేయాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల లెక్క కూడా సరిగా లేదన్నారు. ఇప్పుడు సర్వే చేయడానికి పలు కారణాలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు ఉంటే.. 91 లక్షల వైట్ రేషన్ కార్డులు, ఏడు లక్షల గులాబీ రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. అంటే కుటుంబాల కంటే 22 లక్షల రేషన్ కార్డులు అదనంగా ఉన్నాయన్నారు. వలస పాలనలో ఇలా చాలా దుర్మార్గాలు జరిగాయన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ వల్ల నాలుగు వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పైన పడుతుందన్నారు. ప్రతి దానికి వైట్ రేషన్ కార్డు అనేది గందరగోళానికి దారి తీసిందన్నారు. ఇక నుండి ఒక్క క్లిక్తో అందరి చిట్టా రావాలన్నారు.
అలాగే, ఇప్పటి వరకు తెలంగాణలో 55 లక్షల ఇళ్లు కట్టినట్లుగా ఉందని, ఉన్న కుటుంబాలే 84 లక్షలు అయితే, ఇన్ని ఇళ్లు ఎలా కట్టారన్నారు. గృహనిర్మాణ రంగంలో వందలు, వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. పెన్షన్ ఇస్తామని, ఇళ్లు కట్టిస్తామని కానీ, ప్రాణం పోయినా అనర్హులకు ఇవ్వమన్నారు. కొన్ని పార్టీలకు తెల్లారేసరికి పనులు జరగాలన్నారు.
నిజాం పుణ్యమా అని కోటిన్నర ఎకరాల భూమి ఉండేదని కానీ, ఇన్నాళ్ల పాలకులు దానిని నాశనం చేశారన్నారు. తనను ఇప్పటి వరకు నలభై ప్రపంచ ప్రతినిధుల బృందాలు కలిశాయని, పరిశ్రమలు స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూమిని పరిశ్రమల కోసం ఇస్తామన్నారు. తాము చెప్పినట్లుగా దళితులకు మూడెకరాల భూములు కొనిస్తామన్నారు.
ఒత్తిడి వస్తోంది
ప్రజలు మనకు ఐదేళ్ల టైం ఇచ్చారని, ఉద్యోగులు ఏ విషయంలోను గందరగోళానికి గురి కావొద్దన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వవద్దని హెచ్చరించారు. తమది ఎంప్లాయి ఫ్రెండ్ ప్రభుత్వమేనని, అయితే తప్పులు దొర్లనంత వరకే అన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఫీజు రీయింబర్సుమెంట్స్ ప్రభుత్వం పైన కత్తి పెట్టినట్లుగా ప్రవర్తిస్తున్న తీరు అందరు చూస్తున్నారన్నారు. మహారాష్ట్ర నుండి వచ్చిన వారు కూడా తమ ఫీజులు కట్టమంటే ఎలా కడతామన్నారు. నేటివిటీ నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉందన్నారు. ఇప్పుడు చిన్న పొరపాటు చేస్తే భవిష్యత్తు తెలంగాణ నష్టపోతుందన్నారు.