గవర్నర్తో భేటీ: పాలనాపరంగా కెసిఆర్ తొలి అడుగు
హైదరాబాద్: పాలనాపరంగా తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తొలి అడుగు వేశారు. ఆయన సోమవారం గవర్నర్ నరసింహన్ను కలిసి ఐఎఎస్ అధికారి నర్సింగరావును పరిచయం చేశారు. ఆయనను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించినట్లు సమాచారం.
నర్సింగ రావు కోల్ ఇండియా చైర్మన్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన బలంగా ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో నర్సింగరావును తెలంగాణ ప్రభుత్వ పాలనలో భాగస్వామిని చేయాలని కెసిఆర్ అనుకున్నట్లు చెబుతున్నారు. నర్సింగరావు 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ అధికారులను రప్పించాలని కెసిఆర్ గవర్నర్ను కోరినట్లు సమాచారం.

ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న గోపాల్ రెడ్డి అనే ఐఎఎస్ అధికారిని కూడా తెలంగాణకు రప్పించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల కొరత వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణకు చెందిన అధికారులను త్వరితగతిన రప్పించాలని కెసిఆర్ నరసింహన్ను కోరినట్లు చెబుతున్నారు.
ఎఐఎస్ అధికారుల కొరత, ఇతర విషయాల కారణంగా ప్రభుత్వాన్ని నడపడం ఓ సవాల్ వంటిదని సీమాంధ్ర నాయకులు హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ చురుగ్గా ముందుకు కదులుతున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications