టార్గెట్ సిఎం: కాంగ్రెస్ 'ముఖ్య' నేతలపై కెసిఆర్ పావులు
అందుకోసం కాంగ్రెసు పార్టీలోని ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించడం ప్రధాన లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకున్నా లేదా ఎక్కువ సీట్లలో గెలుచుకొని పొత్తు అనివార్యమైనా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉంటారు.
వారిలో ముఖ్యంగా... దామోదర రాజనర్సింహ (ఆందోల్), పొన్నాల లక్ష్మయ్య (జనగాం), డి శ్రీనివాస్ (నిజామాబాద్ రూరల్), జానారెడ్డి (నాగార్జున సాగర్), ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్ నగర్), గీతా రెడ్డి (జహీరాబాద్), డికె అరుణ (గద్వాల), శ్రీధర్ బాబు (మంథని)లు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.
వీరిపై సాధ్యమైనంత వరకు బలమైన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాలు కెసిఆర్ చేశారంటున్నారు. తెరాసను ఎక్కువ స్థానాలలో గెలిపించడంతో పాటు కాంగ్రెసు సిఎం అభ్యర్థులను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారట. అందుకే వారిపై ఏరికోరి అభ్యర్థులను నిలబెట్టారంటున్నారు.
దామోదర పైన ఇటీవలె టిడిపి నుండి వచ్చిన బాబు మోహన్, పొన్నాల పైన ముత్తిరెడ్డి, జానా పైన లెఫ్ట్ పార్టీ నుండి వచ్చిన నోముల నర్సింహయ్య, గీతా రెడ్డి పైన బలమైన మాణిక్ రావు తదితరులను బరిలోకి దింపుతున్నారని అంటున్నారు.