ఉద్యోగుల అంశంపై కెసిఆర్ దృష్టి: కమిటీ, కఠిన చర్యలే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యోగుల స్థానికత అంశం పైన దృష్టి సారించారు. ఇందుకోసం ముగ్గురితో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ శాసన సభ్యుడు హరీష్ రావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి సభ్యులు స్వామిగౌడ్లు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతం వారే పని చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి నుండి చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. ఉద్యోగులను విభజించారు. అయితే ఉద్యోగుల విభజనలో పారదర్శకత లేదని తెలంగాణ ఉద్యోగులు వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కెసిఆర్... హరీష్ రావు, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను గుర్తించాలని సూచించారు. అలాగే ఉద్యోగుల ఖాళీలను గుర్తించాలని చెప్పారు. ఉద్యోగుల పంపిణీలో తెలంగాణ వారికి అన్యాయం జరగకుండా చూడాలని ఆయన భావిస్తున్నారు.
హరీష్ రావు కమిటీకి సహకరించాలని పలువురు ఐఏఎస్ అధికారులను కెసిఆర్ కోరారు. రేపటిలోగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని చెప్పారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కెసిఆర్ సిద్ధమయ్యారు.
పోలీసు డిపార్టుమెంటులో డిపిసి రగడ
పోలీసు డిపార్టుమెంటులో రాత్రికి రాత్రే కొన్ని ప్రమోషన్లు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వీటిని పలువురు పోలీసు అధికారులు తప్పు పడుతున్నారు. అయితే ప్రమోషన్ల పైన అభ్యంతరాలుంటే పోలీసు వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు. పోలీసు అధికారుల ప్రమోషన్ల పైన పలువురు కెసిఆర్ను కలిశారు. డిపిసిని వెంటనే నిలుపుదల చేయించాలని కోరారు.