నరేంద్ర మోడీ ముందు కెసిఆర్ 14 అంశాలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్తో సమానంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోడీని కోరారు. ఆయన శనివారం మోడీని ఎంపీలతో పాటు కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ నుంచి నిధులు అందుతున్న విషయాన్ని ఆయనకు గుర్తు చేశారు.
పార్టీ ఎంపీలు కే కేశవరావు, జితేందర్ రెడ్డి, కవిత, వినోద్ కుమార్, బాల్క సుమన్, కడియం శ్రీహరి, విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథ్తో కలిసి శనివారం ఆయన మోడీని కలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ప్రతినిధి వర్గంతో జరిగిన సమావేశం మర్యాదపూర్వకమేనని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, తాము తెలంగాణకు ప్రత్యేక కేటగిరీ హోదాతోపాటు దాదాపు 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధాన మంత్రికి అందజేశామని ఎంపీ జితేందర్ రెడ్డి సమావేశం తర్వాత విలేకరులకు చెప్పారు.
కెసిఆర్ ప్రధానికి సమర్పించిన వినతి పత్రంలో అంశాలివి....!
ఆంధ్రప్రదేశ్తో సమానంగా తెలంగాణకు కూడా ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలి. తెలంగాణలోని 8 జిల్లాలకు ఇప్పటికే వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ నిధులు అందుతున్నాయి. ప్రాణహిత చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని కరువు పీడిత జిల్లాల్లో పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తెలంగాణలో పారిశ్రామికీకరణకు పన్ను ప్రోత్సాహకాలు ఇస్తామని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కల్పించిన మాదిరే ఈ ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
హామీ ఇచ్చిన విధంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పాలి. బొగ్గు అనుసంధానాన్ని కల్పించి వేగంగా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలి. పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చినట్లు.. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి హైదరాబాద్ పట్టణాభివృద్ధికి సమగ్ర పథకాన్ని రూపొందించాలి. గ్లోబల్ సిటీగా, ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారిన హైదరాబాద్ను మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు పట్టణ సదుపాయాలు కల్పించాలి.
గుజరాత్లో సబర్మతీ నదీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లే మూసీ నది పరిరక్షణ పథకాన్ని అమలు చేయాలి. ఇందుకు జాతీయ నదీ పరిరక్షణ డైరెక్టరేట్ నుంచి రూ.923 కోట్లు మంజూరు చేయాలి. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లు తెలంగాణలో పండ్ల తోటల యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఇందుకు తగిన భూమిని ప్రభుత్వం కల్పిస్తుంది. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లు గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలను ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేందుకు ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించాలి. జాతీయ రహదారుల అథారిటీ సంస్థ (ఎన్హెచ్ఏఐ) ద్వారా 4207 కి.మీ. రహదారులను జాతీయ రహదారులుగా మెరుగుపరచాలి. ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టీల్ ప్లాంట్ను వెంటనే ఏర్పాటు చేయాలి.
కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీని వేగంగా నిర్మించడం, కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు, పెండింగ్లో ఉన్న కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను చేపట్టడం, పెండింగ్ సర్వేలు వంటి ప్రాజెక్టులను చేపట్టాలి. అటవీకరణ పరిహార నిధి యాజమాన్య ప్రణాళిక అథారిటీ (కాంపా) కింద భారత ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల్లో రూ.1104 కోట్లు తెలంగాణ వాటాకు వస్తాయి.