ప్రధానికి సవరణలిచ్చా, బిజెపిపై తర్వాత చెబుతా: కెసిఆర్
న్యూఢిల్లీ: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెడతామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. కెసిఆర్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు ఉదయం ప్రధానిని కలిశారు. అనంతరం కెసిఆర్ విలేకరులతో మాట్లాడారు.
ఈ సమావేశాల్లోనే బిల్లు పెడతామని ప్రధాని చెప్పారన్నారు. తాము సవరణ ప్రతిపాదనలను ప్రధానికి అందించామన్నారు. హైదరాబాదు పైన గవర్నర్ అధికారాలు పునరాలోచించాలని కోరామన్నారు. విద్యుత్, ఆస్తులు, పెన్షన్లు, ఉద్యోగుల విభజన, ఎపి భవన్ తదితర అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చామన్నారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో యూ టర్న్ తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కదా అన్న ప్రశ్నకు.. తాను ఇప్పుడేమీ మాట్లాడనని బిఏసి సమావేశానికి వెళ్లి వచ్చాక చెబుతానన్నారు. మరోవైపు బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో టిడిపి బృందం భేటీ అయింది.
సీమాంధ్ర న్యాయవాదుల పిటిషన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే సుప్రీం కోర్టులో ఏడు పిటిషన్లు ఉన్నాయి.