భార్యను పరామర్శించిన కెసిఆర్: కలిసిన నటుడు రాజేంద్రప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్ర కె చంద్రశేఖర్ రావు యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్య శోభను శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులనడిగి తెలుసుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆమె ఇటీవల యశోదా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
కాగా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కూడా శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జలుబు, జ్వరం కారణంగా ఆయన శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న 66వ జాతీయ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్కు హాజరుకాలేకపోయారు.
కెసిఆర్ను కలిసిన సుబ్బిరామిరెడ్డి, నటుడు రాజేంద్ర ప్రసాద్,
రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ శనివారం తెలంగాణ సిఎం కెసిఆర్ను కలిశారు. తమ పిల్లల వివాహానికి హాజరుకావాలని వారు కెసిఆర్ను ఆహ్వానించారు.
టిఆర్ఎస్లో చేరిన ఆంజనేయులు గౌడ్
టిఎన్ఎస్ఎఫ్ నేత ఆంజనేయులు గౌడ్ శనివారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో ఆయన టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ఈటెల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ తప్పు చేసి వుంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. నీళ్లు, విద్యుత్ను ఏపి ప్రభుత్వం తీసుకెళ్తే అఖిలపక్షం పెట్టాలని అన్నారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తెచ్చింది టిడిపినేనని ఎర్రబెల్లి చెప్పారు.