ఏపీలోనూ టీఆర్ఎస్ పోటీ..!! జాతీయ పార్టీగా - పక్కా లెక్కలు : జగన్ - టీడీపీ లో ఎవరికి మేలు..!!
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఎంట్రీ. జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న టీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతోందా. గులాబీ పార్టీ నేతల అంతర్గత చర్చల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. జాతీయ పార్టీగా ప్రకటనతో సరి పెట్టకుండా.. ఆ హోదా - గుర్తింపు కావాలంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి. సీఎం జగన్ - కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ సీఎం అయిన తరువాత ప్రగతి భవన్ లో జరిగే సమావేశాలకు హాజరయ్యారు. కేసీఆర్ సైతం అమరావతిలో జగన్ తో సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ కనిపిస్తోంది. కానీ, తాజాగా దావోస్ పర్యటనలో కేటీఆర్ తనకు సీఎం జగన్ పైన ఉన్న అభిమానం చాటుకున్నారు. జగన్ తనకు పెద్దన్న లాంటి వారని చెప్పుకొచ్చారు.

ఏపీలోనూ గులాబీ పార్టీ ఎంట్రీ
ఇక, కేసీఆర్ కు సైతం జగన్ అంటే అభిమానమని పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు జాతీయ పార్టీగా కేసీఆర్ కొత్త పార్టీ నమోదు చేసుకున్న తరువాత ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఆ హోదా ఖరారవుతుంది. జాతీయ పార్టీ కావాలంటే.. ప్రస్తుత నిబంధనల మేరకు లోక్సభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో రెండు శాతం సీట్లు గెలిచి ఉండాలి. లేదా సాధారణ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాల్లో గానీ...శాసనసభ స్థానాల్లో గానీ ఆరుశాతం ఓట్లు పొంది ఉండాలి. దీంతో..ఏపీతో పాటుగా కర్ణాటక.. మహారాష్ట్రలో సైతం టీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కు మద్దతుగా ఏపీలో పలు సందర్భాల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కేసీఆర్ పాలనకు ఏపీలో పలువురి ప్రశంసలు లభించాయి. అయితే, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కొన్ని సమస్యలు మాత్రం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

సర్వేలు..పక్కా లెక్కలతో
తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లో పలు నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి అక్కడకు వెళ్లి సెటిల్ అయని వారి ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. వారిలో అధికశాతం మంది 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కే అక్కడ మద్దతుగా నిలిచారు. ఏపీలో వచ్చే ఎన్నికలు వైసీపీ - టీడీపీ రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా నిలవనున్నాయి. టీఆర్ఎస్ జాతీయ పార్టీ హోదాలో బరిలో దిగితే..ఏపీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ తో పాటుగా పలు కీలక రంగాలకు చెందిన వారి కుటుంబాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకొనే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. ఏ మేర ఓట్లను దక్కించుకున్నా..ఎవరి ఓట్లు చీలుతాయనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.

వైసీపీకి లాభమా - నష్టమా
వైసీపీకి మాత్రం రాజకీయంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతగా చీలితే అంతగా వైసీపీకి ప్రయోజనం. తెలంగాణలో షర్మిల పార్టీ విషయంలోనూ టీఆర్ఎస్ ఆలోచన అదే స్థాయిలో ఉంది. రెడ్డి సామాజిక వర్గం పైన కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటుండగా..అక్కడ షర్మిల పార్టీ ఆ వర్గ ఓట్లను చీల్చటం ద్వారా తమకు ప్రయోజనం అనేది గులాబీ పార్టీ నేతల లెక్క. దీంతో..ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ లెక్కలు..కొత్త వ్యూహాలు ఏపీలోనూ ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏపీ - తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications