'అతని కోసం' అడుగు ముందుకేసిన KCR?
kcr తీసుకున్న నిర్ణయం ఆయన మిత్రుడు జగన్ కు మేలు చేసేదిగా ఉందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకొని వెళ్లడం ఖాయమైన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో పవన్ ఒంటరిగా పోటీచేయడంవల్ల దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి జగన్ లాభించింది. కానీ ఈసారి జగన్ ను ఓడిస్తామని, వైసీపీని గద్దె దించుతామని జనసేనాని ప్రకటిస్తున్నారు.

పొత్తు విఫలమైతే వైసీపీకి లాభం!
పొత్తు విఫలమైతేనే తమకు లాభం కలుగుతుందని విశ్లేషించిన వైసీపీ జనసేనను ఒంటరిగా పోటీచేయడానికి సిద్ధం కావాలంటూ మంత్రులు రకరకాలుగా రెచ్చగొట్టారు. ప్రధానమంత్రిని కలిసి రోడ్ మ్యాప్ తీసుకున్న తర్వాత కూడా వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్ ప్రకటించడంతో దాదాపుగా పొత్తు ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. దీనిద్వారా వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లలో చీలిక వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే తోట ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంతవరకు ఓట్లు చీల్చగలుగుతుందనేది తర్వాత విషయం. ముందు కాపుల ఓట్లలో చీలిక రావడంద్వారా వైసీపీకి లాభం కలుగుతుంది.

మిత్రులుగా కొనసాగుతున్న జగన్, కేసీఆర్?
మొదటి నుంచి జగన్, కేసీఆర్ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. అయితే కేసీఆర్ కేంద్రంతో కయ్యం పెట్టుకోగా జగన్ లోపాయికారీగా సహకరించుకుంటూ వస్తున్నారు. ఈ విషయంతోపాటు షర్మిల పార్టీ విషయంలో ఇద్దరు మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయం వైసీపీకి మేలు చేసేదిగా ఉంది.

ఏపీలో టీడీపీ వస్తే తమకు కష్టం!
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే హైదరాబాద్ కు వచ్చే పెట్టుబడుల్లో కొన్ని చంద్రబాబునాయుడు తరలించుకుపోయే ప్రమాదముంది. అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయడంవల్ల బీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం చేకూరుస్తుంది. దీన్ని నిరోధించాలంటే ముందుగా చంద్రబాబుకు చెక్ పెట్టాలనేది కేసీఆర్ నిర్ణయం. ఈసారి ఏపీ ఎన్నికల్లో టీడీపీకి అధికారం చేజిక్కించుకోవడం అత్యవసరం. ఆ విషయం కేసీఆర్ కు తెలుసు. సరిగ్గా రెండోసారి వైసీపీ వచ్చేలా సహకరించగలిగితే అటు చంద్రబాబుకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.

ఏపీకన్నా ముందే తెలంగాణకు ఎన్నికలు?
ఏపీకన్నా తెలంగాణకు ముందే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్న జగన్ తెలంగాణతోపాటు ఏపీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహింపచేయాలనే యోచనలో ఉన్నారు. అందుకు కేంద్ర సహకారం అవసరం. ఈ విషయమై ఇటీవలే ఆయన ప్రధాని మోడీని, అమిత్ షాను కలిశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలనుకున్న కేసీఆర్ వైఖరిపై బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ముందు తెలంగాణపై దృష్టిసారించి, ఆ తర్వాతే ఏపీపై దృష్టి సారించాలనేది బీజేపీ యోచన. దీనివల్ల రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలపై బీజేపీ నేతలు పెద్దగా మొగ్గుచూపలేదంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఏపీ రాజకీయం భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరగబోతోందో చూడాలి.












Click it and Unblock the Notifications