'ముందస్తు'తో BJPని భయపెడుతున్న KCR?
రాజకీయ వ్యూహాల్లో గండర గండడు, ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా వ్యూహాలను పన్నగల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అదిగో ముందస్తు, ఇదిగో ముందస్తు, తూచ్ ముందస్తు లేదు అంటున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు అయోమయానికి గురవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ స్వయంగా ప్రకటించినప్పటికీ 'ముందస్తు'కు సంబంధించిన వార్తలు మాత్రం ఆగడంలేదు. దీనికి కారణం టీఆర్ఎస్ పార్టీ చాపకింద నీరులా ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను చేసుకుంటూ వెళ్లడమే.

అభ్యర్థులు దొరకడం బీజేపీకి కష్టం?
ముందస్తు ఎన్నికలు జరిగితే అభ్యర్థులను నియోకవర్గాల్లో నిలబెట్టడమే కష్టంగా మారుతుందని భారతీయ జనతాపార్టీ నేతలు భావిస్తున్నారు. కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, విజయశాంతి, ఈటెల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాజాసింగ్.. అంతే.. ఇలా వేళ్లమీద మాత్రమే లెక్కపెట్టగలిగినంతమంది నాయకులే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని ప్రకటిస్తున్న బీజేపీ పరిస్థితి ఇలా ఉంది. గతంలో కేంద్ర పెద్దలతో సంబంధాలు మంచిగా ఉన్న తరుణంలో ముందస్తుకు వెళ్లి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ కు, బీజేపీకి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.

రాష్ట్రపతి పాలన పెడితే?
ఒకవేళ కేసీఆర్ ముందస్తు ప్రకటిస్తే ఆ సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనేది బీజేపీ నేతల యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమ నేత వారికి అటువంటి అవకాశం ఇవ్వరని టీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి. మందుస్తు వల్ల 2018 ఫలితాలే వస్తాయని బీజేపీ నేతలకు తెలుసంటున్నారు. సత్సంబంధాలున్నాయి కాబట్టి అప్పుడు కేంద్రం సహకరించింది. కానీ ఇప్పుడు ఐటీ, ఈడీ దాడులే జరుగుతున్నాయి. దీంతో గులాబీ పార్టీ కమలం జాతీయ స్థాయి నేతలను టార్గెట్ చేసింది.

ఇరుపార్టీల బెదిరింపులు?
రాష్ట్రపతి పాలన పెడితే అది కేసీఆర్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే మరికొందరు నేతలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. బీజేపీకి కావల్సింది కూడా షెడ్యూల్ ప్రకారం జరగడమే. వీలైనంతమంది నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి ఈ సమయం సరిపోతుందని పార్టీ భావిస్తోంది. ముందస్తుకు వెళతానని కేసీఆర్ భయపెడుతుంటే రాష్ట్రపతి పాలన విధిస్తామని కేంద్రం బెదిరిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య నలిగిపోతున్న ప్రజానీకం మాత్రం సమయం, సందర్భం చూసుకొని కొర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications