వైసీపీకి లాభమా - నష్టమా : కేసీఆర్ పై ఎందుకీ ఆరాధన : జరిగేదేంటి..!
తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వైసిపి లో కొత్త వ్యవహారాలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు అవసరానికి మించి టిఆర్యస్ అధినేత కెసీఆర్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తుంటే..వైసిపి నేతల్లో మాత్రం కేసీఆర్ ఆరాధన తగ్గటం లేదు..
కేసీఆర్ పై ఏంటీ అభిమానం..ఎందుకంటే..!
ఏపిలో వైసిపి కి సంబంధించిన నేతలు ఈ మధ్య కాలంలో..ప్రధానంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కేసీ ఆర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలవగానే వైసిపి నేతలు చెవిరెడ్డి భాస్కరెడ్డి..కొడాలి నాని వంటి వారు ఏకంగా కెసీఆర్ కు అనుకూలంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. అదే విధంగా కేసీఆర్ విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలోనూ ఇదే రకమైన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. దీని పై టిడిపి అధినేత బహిరంగంగానే విమర్శలు చేసారు. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే..ఇక్కడ వైసిపి నేతలకు ఎందుకు సంతోషం అంటూ ప్రశ్నించారు. కానీ, తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వైసిపి నేతలు ఏర్పాటు చేసిన అభినందనలఫ్లెక్సీ ల్లో ఇప్పుడు కేసీఆర్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఇది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమైంది..
చంద్రబాబు ను ఓడించారనా..మరి ఏపిలో..!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని..టిఆర్యస్ ను ఓడించాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, అక్కడి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు మద్దతుగా తీర్పు ఇచ్చారు. తెలంగాణలో చంద్రబాబు ఏర్పాటు చేసు కున్న కూటమి ఓడిపోవాలని..సహజంగా టిడిపికి వ్యతిరేకంగా ఉండే వైసిపి..జనసేన అభిమానులు కోరుకున్నారు. ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల సానుభూతి పరులు టిఆర్యస్ కు మద్దతుగా ప్రచారం చేసారనే వాదన వినిపించింది. ఇక, టిడిపి అధినేత చంద్రబాబు..ఇప్పటికీ మోదీ-కేసీఆర్-జగన్ ఒకే కూటమి అంటూ విమర్శలు చేస్తున్నారు. వీరు ఏపికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏపిలో మోదీ- కేసీఆర్ పేరు చెప్పి సెంటిమెంట్ ద్వారా రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో వైసిపి - జగన్ ను చేర్చటం ద్వారా రాజకీయంగా మేలు జరుగుతుందని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు..
అత్యుత్సాహమా..అవసరమా..వైసిపి లో చర్చ..!
ఇప్పుడు ఇదే చర్చ వైసిపిలో నూ కొనసాగుతోంది. రాష్ట్ర విభజన పై ఇప్పటికీ ఏపి ప్రజల్లో వ్యతిరేకత పూర్తి స్థాయిలో పోలేదు. చంద్రబాబు పై విమర్శలు చేస్తూ...చంద్రబాబు ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్న కేసీఆర్ పై టిడిపి వ్యతిరే కుల్లో అభిమానం కనిపిస్తున్నా..తటస్థుల్లో మాత్రం ఏరకమైన భావన వ్యక్తం కావటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వైసి పి నేతలు కేసీఆర్ ను అవసరానికి మించి ఆదరణ చూపిస్తున్నారనే అభిప్రాయం పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. తాజాగా.. నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తె లంగాణ సీఎం కేసీఆర్ ఫొటో చర్చనీయాశమైంది. ఓ వైపు శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి. మరో వైపు కేసీఆర్, మధ్యలో వైఎస్ జగన్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీని కర్నూలు జిల్లా నంద్యాల-బండి ఆత్మకూరు రహదారిలో సంతజూటూరు వద్ద ఏర్పాటు చేసారు. ఇప్పుడు వైసిపి నేతలు కేసీఆర్ ను ఆరాధిస్తున్న తీరు రాజకీయంగా ఎటువం టి పరిణామాలకు దారి తీస్తుందో అనే చర్చ సాగుతోంది.