బాబు, ఎన్టీఆర్ ఇచ్చారు, అశ్చర్యపడేలా: కెసిఆర్
హైదరాబాద్: సమగ్ర సర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా వివరాలు ఇచ్చారని, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్వేకు సహకరించి, కుటుంబ వివరాలు అందించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. కనీవినీ రీతిలో, అందరూ ఆశ్చర్యపడేలా సర్వే జరిగిందని ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆంధ్ర మిత్రులు కూడా వివరాలు అందించారని ఆయన అన్నారు.
ఏ విధమైన లాభాపేక్ష లేకుండా వివిధ రంగాలకు చెందినవారు సర్వేలో పాల్గొన్నారని ఆయన అన్నారు. ఇన్నాళ్లు మనం ఎంత చీకట్లో ఉన్నామో సర్వే వల్ల అర్థమైందని ఆయన అన్నారు. సర్వేను వ్యతిరేకించి ప్రతిపక్షాల నేతలు వాళ్ల పరువు వాళ్లే తీసుకున్నారని ఆయన అన్నారు. ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా పథకాలు అమలు చేయడానికి సర్వే ఉపయోగపడుతుందని, సర్వే వల్ల బహుముఖ ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు. ఇంకా కొన్ని వివరాలు అడిగితే బాగుండేదని అంటున్నారని మీడియా ప్రతినిధులు అంటే, అడిగినవాటికే గొడవ చేస్తే.. అని కెసిఆర్ అన్నారు.
అప్పులు కూడా అడిగారని కెసిఆర్ చెప్పారు. హైదరాబాదులో 15 లక్షల ఇళ్లు మాత్రమే ఉన్నాయని అనుకుంటున్నామని, సర్వే వల్ల 20లక్షలకు పైగా ఉన్నట్లు తేలిందని ఆయన అన్నారు. తెలంగాణ జనాభా కూడా మూడున్నర కోట్లే అనుకుంటున్నామని, కానీ నాలుగున్నర కోట్లకు పైగా ఉందని తెలిసిందని ఆయన అన్నారు. హైదరాబాదు జనాభా కూడా కోటీ 20 లక్షల దాకా ఉన్నట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు. సర్వే వల్ల హైదరాబాదుకు ఎంత మంచినీరు కావాలి, ఎలా పథకాలు రూపొందించాలనేది అర్థమవుతుందని ఆయన అన్నారు.
కుమారుడైనా సహించం
సర్వే ఇంత సులభంగా ఉంది, ఎందుకు వివాదం చేశారని ప్రజలు అంటున్నారని, తెలంగాణ ప్రజలు సర్వేకు స్వచ్ఛందంగా సహకరించారని, ఎన్యూమరేటర్లకు తాము ప్రజలను పట్టించుకుంటామని, అరిచేవాళ్లను కాదని ఆయన అన్నారు. దొంగలను, లూటీ చేసేవాళ్లను శిక్షిస్తామని ఆయన అన్నారు. తన కుమారుడు తప్పు చేస్తే కూడా జైలుకు పంపుతామని ఆయన అన్నారు. మూర్ఖులకు ఇది అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
ఈ సర్వే చూసి దేశంలోని అన్ని రాష్ట్రాలు కదులుతాయని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు తీసుకోవడం లేదు కాబట్టి సర్వేలో పాల్గొనమని అన్నారని, హైదరాబాదులో ఉన్నప్పుడు వివరాలు ఇవ్వాలని ఆయన అన్నారు. కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే కాదని, వివిధ సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సంకుచితంగా ఆలోచించవద్దని ఆయన అన్నారు.
సర్వే జిల్లాల్లో 95 శాతం, హైదరాబాదులో 88 శాతం జరిగిందని ఆయన అన్నారు. సర్వేకు సహకరించినట్లే తమకు మిగతా కార్యక్రమాల్లో సహకరిస్తే ప్రజలు కలలు గన్న తెలంగాణను నిర్మించి ఇస్తానని ఆయన చెప్పారు. ప్రజలు కలలు గన్న తెలంగాణను అప్పగిస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ విధంగా కూడా పనిచేస్తుందా అనే ఆశ్చర్యపడే విధంగా చేసి చూపిస్తామని ఆయన అన్నారు. సర్వే డాటా కంప్యూటరీకరణ జరిగి, అంతటా అందుబాటులో ఉంటుందని, దానివల్ల అర్హులకే ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. కేంద్రానికి కూడా ఈ సర్వే కళ్లు తెరిపిస్తుందని ఆయన అన్నారు. సర్వే వల్ల దొంగలకు, ప్రజల సొమ్ము మింగేవారికి బాధ అని ఆయన అన్నారు. ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లకు 51 వేల రూపాయల చొప్పున ఇస్తామని, మునుపటిలా వస్తువులు కొనివ్వబోమని, డబ్బులు బ్యాంకు ఖాతాలో వేస్తామని, ఇటువంటి దానికే తాము బ్యాంక్ ఖాతాలు అడిగామని, దాన్ని కూడా వివాదం చేశారని ఆయన అన్నారు.
ఏడు మండలాలు మనవి కావు...
ఖమ్మం జిల్లాలోని భద్రచాలం డివిజన్లో ఏడు మండలాలు తమవి కావని, కోట్లాడినా ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపేశారని, ఇప్పుడు ఏమీ చేయలేమని కెసిఆర్ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఆ మండలాల ప్రజలకు సంబంధించి ఓ మీడియా ప్రతినిధి అడిగినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ పార్లమెంటులో చట్టం చేశారని, రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారని, అందుకే ఆ మండలాల్లో సర్వే నిర్వహించలేదని ఆయన వివరించారు.
సింగపూర్కు నేనొక్కడినే...
సింగపూర్ నుంచి పర్యటన చివరలో మలేసియా రాజధాని కౌలాలంపూర్ వరకు కారులో ప్రయాణం చేస్తే హైదరాబాదును మురికివాడలు లేని నగరంగా ఎలా చేయవచ్చునో మీకు అర్థమవుతుందని సింగపూర్ ప్రతినిధులు చెప్పారని కెసిఆర్ అన్నారు. సింగపూర్లో హైదరాబాదును ప్రపంచచిత్రపటంపై పెట్టడానికి వీలుంటుందని ఆయన అన్నారు. మలేసియాలో నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రిని కాబట్టి దేశంలో తనను ఒక్కడినే సింగపూర్ ఆహ్వానించారని ఆయన అన్నారు. సింగపూర్లో ఐఐఎం విద్యార్థుల సదస్సుకు తనను ఆహ్వానించారని ఆయన చెప్పారు.