ప్రేమ్జీ హామీ ఇచ్చారు, జైలుకు ఎంతమందో: కేసీఆర్
హైదరాబాద్: విప్రో చైర్మన్ ప్రేమ్జీతో మాట్లాడానని, ఆయన విప్రో నుండి 5వేల ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అసెంబ్లీలో అన్నారు. చత్తీస్గఢ్ విద్యుత్ విషయంలో ఎవరికీ అనుమానాలు వద్దన్నారు. కృష్ణపట్నం, హిందూజాల నుండ మన వాటా తీసుకుందామన్నారు. రాష్ట్రంలో ఎస్టీల జనాభా 10 శాతం ఉందని, వారికి 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నారు.
ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయాలని ప్రధానికి పలుమార్లు లేఖ రాశానని చెప్పారు. కమల్ నాథన్ కమిటీ ఇంకా పంపిణీ పూర్తి చేయలేదన్నారు. జూలైలోగా 1500 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి తీసుకు వస్తామన్నారు. విద్యుత్ విషయంలో కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తామన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యుత్తు పైన జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. వచ్చే బడ్జెట్ కల్లా అన్ని లెక్కలు సెటిల్ అవుతాయని చెప్పారు.
కేంద్రం నిధులు కొన్ని ఏపీ ఖాతాలో జమ అవుతున్నాయన్నారు. త్వరలో అఖిల పక్షంతో ప్రధానిని కలుస్తామని చెప్పారు. తాము తప్పులు చేయాలని చాలామంది కోరుకుంటున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మెట్రో పనులు సాగుతున్నాయన్నారు. మెట్రో అనుకున్న సమయానికే పూర్తి అవుతుందన్నారు. మెట్రో రైలుకు చెందిన ఇంచు భూమిని కూడా తాము ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు.
దళితులకు భూపంపిణీ నిరంత ప్రక్రియ అన్నారు. ల్యాండ్ సీలింగు చట్టం తెచ్చిన ఘనత ఇందిరదే అన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియాలన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు కచ్చితంగా కట్టించి ఇచ్చి తీరుతామన్నారు. ఇళ్ల కుంభకోణంలో ఎంతమంది జైలులో ఉంటారో తెలియని పరిస్థితి అన్నారు. అసైన్డ్ భూముల పంపకం అశాస్త్రీయంగా ఉందన్నారు. కమతాల ఏకీకరణ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు.
ఉద్యోగులకు హెల్త్ కార్డులు సదుద్దేశ్యంతోనే ఇచ్చామన్నారు. ఫీజురీయింబర్సుమెంట్స్ పథకం పటిష్టం చేస్తామన్నారు. తాము కడుపు, నోరు కట్టుకొని ఒళ్లు దగ్గర పెట్టుకొని పనులు చేస్తామన్నారు. వచ్చే నాలుగు నెలల తర్వాత కల్యాణ లక్ష్మీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుందన్నారు. ఐటీఐఆర్కు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు.
బడ్జెట్ మానవీయ కోణంలో: ఈటెల
తమ బడ్జెట్ మానవీయకోణంలో ఉందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అమరులు కోరుకున్న బంగారు తెలంగాణ సాకారం చేస్తామన్నారు. 14వ ఆర్థిక సంఘం తమ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుందని తెలిపారు. మన ఊరు మన ప్రణాళికతలతో బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. సమగ్ర అవగాహనతో బడ్జెట్ రూపొందించామన్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీల ప్రతిపాదనలు బేరీజు వేసుకున్నామన్నారు.
బడ్జెట్ పైన జానారెడ్డి విమర్శలు సరికాదన్నారు. బడ్జెట్కు ముందు కేసీఆర్ అన్ని శాఖలతో చర్చలు జరిపారన్నారు. ఇన్నాళ్లు తెలంగాణ కష్టాల పైన పాటలు పాడామని, ఇక ముందు బంగారు తెలంగాణ పైన పాటలు ఉంటాయన్నారు. అన్నం పెట్టే తెలంగాణను తాము తయారు చేస్తామని చెప్పారు.
తెల్ల రేషన్ కార్డుల పైన ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని ఈటెల చెప్పారు. కాకతీయ మిషన్ పేరుతో చెరువులను పునరుద్ధరిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. చెరువుల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామన్నారు. చెరువులను కబ్జా చేసిన వారి పైన చర్యలు తీసుకుంటామని హరీష్ రావు చెప్పారు.