నాడు.. నేడు బాబు: కెసిఆర్కు దొరికిపోతున్న టీటీడీపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారణంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డంగా దొరికిపోతున్నారా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో మంచి క్యాడర్ ఉన్న టీడీపీనే కెసిఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెసు పార్టీని కూడా ఆయన విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ.. ప్రధానంగా టీడీపీనే టార్గెట్ అయిందని అప్పట్లో భావించారు. అప్పుడు తెరాసలో చేరిన వారిలో ఎక్కువ మంది టీడీపీ వారే ఉన్నారు.

అయితే, దీనికి కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉండటమే కారణమనే వాదన ఉన్నప్పటికీ... చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా టీటీడీపీ ఇరకాటంలో పడిపోయింది. దీంతో కీలక నేతలు సైకిల్ దిగి కారు ఎక్కారు. ఇప్పటికీ కెసిఆర్ టార్గెట్ ప్రధానంగా టీడీపీయేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెరాస, కాంగ్రెసు పార్టీ మధ్యనే హోరాహోరీ ఉంటుందని, టీడీపీ ప్రభావం ఏమాత్రం కనిపించదని అందరూ భావించారు. అయితే, అంచనాలు కొంత తారుమారు అయ్యాయి. తెరాస కేవలం మేజిక్ ఫిగర్ కంటే మూడు స్థానాలను గెలుచుకొని విజయబావుటా ఎగరవేసింది. అదే సమయంలో కాంగ్రెసు పార్టీతో టీడీపీ పోటా పోటీ అన్నట్లుగా సత్తా చాటింది. అందుకు టీడీపీకి తెలంగాణలో మంచి కేడర్ ఉండటమేనని అంటారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కెసిఆర్ విపక్షాలను.. మరీ ముఖ్యంగా బలమైన కేడర్ కలిగి, ఎన్నికల్లో ఊహించని విధంగా సత్తా చాటిన టీడీపీని లక్ష్యంగా చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు ఆయనకు అవకాశాలు కూడా కలిసి వస్తున్నాయంటున్నారు.
విభజనకు ముందు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఆ పార్టీని దెబ్బతీసేందుకు ఉపయోగపడగా.. ఇప్పుడు ఎపిలో టీడీపీ అధికారంలో ఉండటంతో.. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడే ప్రతి అంశానికి లేదా సమస్యకు చంద్రబాబును తెరాస ప్రభుత్వం టార్గెట్ చేసేందుకు వెసులుబాటు కలిగింది.
అంతిమంగా అది తెలంగాణలోని టీటీడీపీ నేతలకు ఇబ్బందులు కలిగిస్తుందని, తెలంగాణలో టీడీపీ ఉనికికి సమస్యగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉమ్మడిగా ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది.
ఇప్పటికే ఫీజు రీయింబర్సుమెంట్స్, పీపీఏల రద్దు, సాగర్ నీటి విడుదల తదితర సమస్యలు వేడి రాజేస్తున్నాయి. ఈ సమస్యలను చూపిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టీడీపీ నేతలను ప్రశ్నిస్తోంది. చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఇంకా ఆ పార్టీలో ఎలా ఉండగల్గుతున్నారని కెసిఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో పట్టు కోసం కెసిఆర్కు విభజనకు ముందు, విభజన తర్వాత కూడా చంద్రబాబే ఆయుధంగా దొరికారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications