2న సిఎంగా ప్రమాణం: లోకసభకు కెసిఆర్ రాజీనామా
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం లోకసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను లోకసభ సెక్రటరీ జనరల్కు పంపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కెసిఆర్ మెదక్ లోకసభకు, గజ్వెల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. రెండింట ఆయన గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 60. ఆ పార్టీ 63 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. దీంతో తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
జూన్ 2వ తేదీన కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మెదక్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేశారు. కెసిఆర్ రాజీనామా నేపథ్యంలో ఆరు నెలల్లో మెదక్ లోకసభకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
మెదక్ నుండి లోకసభకు పోటీ చేయించే విషయమై ఇప్పటికే కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల్లో జోరుగా చర్చ సాగుతోంది. టిడిపి, బిజెపి కూటమిగా బిజెపి అభ్యర్థి బరిలోకి దిగనున్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్, తెరాసలు కూడా కసరత్తు చేస్తున్నాయి.