హరీశ్తో రివ్యూ: నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమన్న కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి అరవిందరెడ్డిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల పాకాల ప్రాజెక్టు పనులకు సంబంధించి సర్వే నిర్వహించి పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సెప్టెంబరులో ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు సైతం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ. 5.73 కోట్లు, జూరాల పాకాల ప్రాజెక్టుకు రూ. 3.3 కోట్లు సర్వే పనుల కోసం ఈ సందర్భంగా విడుదల చేశారు. పాలమూరు సర్వే పనులను ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీకి, పాకాల పనులను వ్యాప్కోకు అప్పగించారు. రెండు నెలల్లోగా సర్వే నివేదికను సమర్పించాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
త్వరలో పారిశ్రామిక విధానం
రెండు మూడు రోజుల్లో పారిశ్రామిక విధానం ప్రకటించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయన బుధవారం కొత్త పారిశ్రామిక విధానంపై అధికారులతో సమీక్ష జరిపారు. ఏకగవాక్ష(సింగిల్ విండో) పద్దతి ద్వారా పరిశ్రమలకు త్వరగా అనుమతులు లభిస్తాయని ఆయన తెలిపారు. తన ఆధీనంలో చేజింగ్ సెల్ ఉంటుందని కెసిఆర్ చెప్పారు. పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనకు 2 లక్షల ఎకరాలు కేటాయించనున్నట్లు తెలిపారు.