ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాం, నిందలు పట్టించుకోను: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రజల దీవెన తనకు ఉన్నంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా, నిందలు మోపినా ముందుకు సాగిపోతూనే ఉంటానని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలపై ప్రజలకు విశ్వాసం ఉందని అందుకు నిదర్శనమే సభ్యత్వ నమోదు 50 లక్షలకు చేరువలో ఉందని ఆయన తెలిపారు. సభ్యత్వాన్ని 30 లక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందని ఆయన అన్నారు.
ప్రజలిచ్చిన స్ఫూర్తితో ఒళ్లు దగ్గర పెట్టుకుని పేదల ప్రభుత్వంగా మరిన్ని సంక్షేమ పథకాలను అమలుచేస్తామని ఆయన ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్కు వచ్చిన కెసిఆర్ సభ్యత్వ నమోదుపై మంత్రులు, స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ముందు అనుకున్నట్టుగా శుక్రవారంతో సభ్యత్వ నమోదు ముగిసినా ప్రజల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈనెల 28వ తేదీ వరకూ గడువుపెంచినట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో అవినీతిరహితంగా ప్రభుత్వాన్ని నడిపించడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని, ఇది చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని అన్నారు. 2018 నాటికి తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంట్పోని విధంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. పటిష్ఠమైన యంత్రాంగంతో అభివృద్ధి సాధించడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. త్వరలోనే నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు.
యువతకు ఉపాధితో పాటు పారిశ్రామికంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. సభ్యత్వాన్ని తీసుకున్నవారందరికీ వ్యక్తిగత బీమా కల్పిస్తామని, దీనికి సంబంధించి కొన్ని కంపెనీలతో చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. సభ్యత్వ రుసుము ద్వారా ఇప్పటికేపార్టీ ఖజానాకు రూ. 3.5 కోట్లు వచ్చాయని, మొత్తం 8.5 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో వచ్చిన విరాళాలలో రూ. 4 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయని అన్నారు. ఈ నిధులతో 50 లక్షల మందికి ఇన్సూరెన్స్ చేయిస్తామన్నారు. సభ్యత్వానికి సంబంధించి వివరాలన్నీ ఆన్లైన్లో ఉంచుతామని, ఇన్సూరెన్స్కు సంబంధించి కూడా సభ్యులకుఆన్లైన్ ద్వారా వివరాలను అందిస్తామని అన్నారు.
తమ పార్టీ గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని, మార్చి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు మండల కమిటీలను పూర్తిచేస్తామని, తర్వాత జిల్లా కమిటీలను కూడా పూర్తిచేసి ఏప్రిల్ 24న ఎల్బి స్టేడియంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని అన్నారు. ఏప్రిల్ 27న సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఇక బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి 10లోపు ఏ తేదీ లోనైనా జరిగే అవకాశం ఉందని కెసీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications