నాకు నీవు..నీకు నేను: జగన్ కాన్వాయ్ కోసం ఆగిపోయిన కేసీఆర్: ఏపీ సీఎం సైతం..!
ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకరికి ఒకరు ఏ స్థాయిలో గౌరవించుకుంటున్నారో మరో ఘటన రుజువు చేస్తోంది. ఏపీలో జగన్ విజయం కోసం కేసీఆర్ తన వంతు సహకారం అందించారు. ఏపీలో జగన్ గెలుపు ఖాయమని ముందు నుండే కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఇక, ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు కీలక అంశాల్లో ఒక్కటిగా కదులుతున్నారు. పరస్పర గౌరవంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ వెళ్లారు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్కు జగన్ వెళ్తున్న కాన్వాయ్ని స్వయంగా కేసీఆర్ నిలుపుదల చేయించారు. దీనికి తెలుసుకున్న జగన్ సైతం అదే విధంగా రియాక్ట్ అయ్యారు.
జగన్ కాన్వాయ్ కోసం కేసీఆర్ ఇలా..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురువారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. ఆయన తెలంగాణ భవన్ మీదుగా తన నివాసం అయిన లోటస్ పాండ్కు వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నానక్ రాం గూడలో హీరో కృష్ణ నివాసానికి వెళ్లబోతున్నారు. అక్కడ కృష్ణ సతీమణి విజయ నిర్మలకు నివాళి అర్పించేందుకు కేసీఆర్ బయల్దేరారు. అప్పుడే అటుగా ఏపీ సీఎం కాన్వాయ్ రాబోతోదంటూ భద్రతా సిబ్బంది కేసీఆర్కు వివరించారు. దీంతో..విషయం తెలుసుకున్న కేసీఆర్..ఏపీ ముఖ్యమంత్రి కోసం తన ప్రయాణాన్ని కొద్ది సేపు వాయిదా వేసుకున్నారు. జగన్ కాన్వాయ్ వెళ్లే వరకూ తన కాన్వాయ్ను బయటకు తీయవద్దని సిబ్బందికి సూచించారు. జగన్ కాన్వాయ్ వెళ్లిన తరువాత కేసీఆర్ వాహన శ్రేణి అక్కడి నుండి బయలు దేరి నానక్ రాం గూడా వైపు వెళ్లింది.
ఒకరికి మరొకరి అవసరం..
రాష్ట్ర విభజన జరిగి అయిదేళ్లు పూర్తయినా..ఇంకా రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అదే విధంగా ఉన్నాయి. చంద్రబాబు - కేసీఆర్ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో తొలుత సఖ్యత కనిపించి నా ఆ తరువాత విభేదాలు తలెత్తాయి. రాజకీయంగానూ విభేదించారు. దీంతో..సమస్యల పైన చర్చలు సాధ్యం కాలేదు. ఇక, జగన్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తొలుత హైదరాబాద్లోని కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్కు వెళ్లారు. ఎన్నికల్లో గెలిచి తన నివాసానికి వచ్చిన జగన్ దంపతులకు గేటు వద్దకు వెళ్లి మరీ కేసీఆర్ ఆహ్వానం పలికారు. అదే విధంగా జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ఆ తరువాత ఉండవల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆయన ఇచ్చిన విందు స్వీకరించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల్లో భాగంగా సచివాలయ భవనాల సమస్య పరిష్కారం అయింది. అదే విధంగా నీటీ పంపకాల గురించి ఇద్దరూ కలిసి చర్చించాలని నిర్ణయించారు.
రెండు రోజుల పాటు కీలక చర్చలు..
ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య రెండు ప్రాంతాల సమస్యల పైన రెండు రోజుల పాటు కీలక చర్చలు సాగనున్నాయి. ఇందుకు ప్రగతి భవన్ వేదిక కానుంది. ఈ చర్చల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి నీటి వినియోగం పైన ఒక నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే దీనికి సంబందించి ఏపీ అధికారులు తెలంగాణ అధికారులతో చర్చలు ప్రారంభించారు. నీటి వినియోగం తో పాటుగా విద్యుత్ బకాయిలు..ఉద్యోగుల పంపిణీ.. రవాణా వ్యవస్థలో మార్పులు..పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాల్సిన అంశాల పైన వీరిద్దరూ చర్చించనున్నారు. అదే సమయం లో ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతుగా కేసీఆర్ ఏపీ సీఎం సమక్షంలోనే లేఖ రాస్తారని సమాచారం. దీని ద్వారా తాను కేసీఆర్తో ఎందుకు సఖ్యత కోరుకుంటున్నానో..ఏపీకీ జరిగే ప్రయోజనాలు ఏంటో జగన్ ఏపీ ప్రజలకు అర్దమయ్యేలా చేయటం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.