కెసిఆర్ క్యాబినెట్లో 9 మంది వీరే: 2వ తేదీన్నే ప్రమాణం
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జూన్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పండితులు నిర్ణయించిన ముహూర్తంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. హైదరాబాదులోని రాజభవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 2వ తేదీననే అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి.
ఆయనతో పాటు తొమ్మిది మంది తెరాస శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నిజానికి, తనకు కలిసి వచ్చే ఆరు సంఖ్యను బట్టి ఆరుగురినే తొలుత మంత్రివర్గంలోకి తీసుకోవాలని కెసిఆర్ అనుకున్నారు. అయితే, 9 సంఖ్య కూడా కలిసి వస్తుందని చెప్పడంతో ఆయన 9 మందిని మొదటి విడత మంత్రులుగా తీసుకుంటున్నారు.

హరీష్ రావు (మెదక్ జిల్లా), కెటి రామారావు (కరీంనగర్ జిల్లా), జూపల్లి కృష్ణారావు (మహబూబ్నగర్ జిల్లా), మధుసూదనాచారి (వరంగల్ జిల్లా), ఈటెల రాజేందర్ (కరీంనగర్ జిల్లా), జలగం వెంగళరావు (ఖమ్మం జిల్లా), జోగు రామన్న (ఆదిలాబాద్ జిల్లా) పోచారం శ్రీనివాస రెడ్డి (నిజామాబాద్ జిల్లా), జగదీశ్వర్ రెడ్డి (నల్లగొండ జిల్లా) తొలి విడత కెసిఆర్ మంత్రివర్గంలో చేరుతారని భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఈటెల రాజేందర్తో పాటు సిరిసిల్ల స్థానం నుంచి విజయం సాధించిన తన కుమారుడు కెటి రామారావుకు కూడా తొలి విడత మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం తొలి విడత లభించడం లేదు.
కెసిఆర్తో మహంతి భేటీ
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బృందం శుక్రవారం భేటీ అయింది. ఉద్యోగుల విభజన, సచివాలయం, ఆస్తులు-అప్పులు తదితర అంశాలపై మహంతి పవర్పాయింట్ ప్రజంటేషన్ను ఇచ్చారు. లేకవ్యూ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో గతంలో తెరాసలో చేరిన పలువురు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications