సర్దుబాటు తప్పదు: పార్టీ నేతలకు సర్దిచెప్పిన కెసిఆర్
హైదరాబాద్: ముందు ముందు చాలా మందిని పదవుల్లో సర్దుబాటు చేయవచ్చని, ప్రస్తుతం పదవులు దక్కని పార్టీ నాయకులు అప్పటివరకు ఓపిగ్గా ఉంటే చాలునని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. పదవులు దక్కలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ అవకాశాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడ అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వార్షికోత్సవ నిర్వహణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. టిఆర్ఎస్లో కొత్తగా చేరే వారిని పార్టీలో ఇముడ్చుకోవాలని కెసిఆర్ చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తయితే వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ స్థానాలు పెరుగుతాయని, ఇంకా చాలా పదవులు వస్తాయని, అనేక మందికి అవకాశాలు దక్కుతాయని, వారికి ఓపిక ఉంటే చాలునని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పార్టీ యంత్రాంగాన్ని రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని చెప్పారు.

త్వరలో సనత్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుందని, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని, ఆ తర్వాత వచ్చేవి సాధారణ ఎన్నికలేనని, అందుకే 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగటానికి ఆరు నెలల ముందే ప్రభుత్వ పథకాలన్నీ అమల్లోకి వచ్చేలా చూసుకోవాలని చెప్పారు. వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని, నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందిస్తామని చెప్పారు.
నల్గొండ జిల్లాలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి త్వరగా అనుమతులు తెచ్చుకోవాల్సి ఉందని, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటామని తెలిపారు. జిల్లాల్లోనే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలోపేతంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో మూడవ వంతు జనాభా హైదరాబాద్లోనే ఉన్నందున నగరంలో క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే, త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఏప్రిల్ 27న పార్టీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిద్దామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రులు కాకుండా ప్రజల్లోకి దూసుకుపోయే పార్టీ నేతలను గుర్తించి ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు జోక్యం చేసుకొని కొందరి పేర్లను ప్రస్తావించారు. పార్టీలో పాత, కొత్త నాయకులు, కార్యకర్తలు.. అందరినీ కలుపుకొని వెళ్లాలని సీఎం చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో విజయం సాధించిన స్ఫూర్తితో గ్రేటర్ హైదరాబాద్ నలువైపులకూ వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications