కేసీఆర్! మీరిచ్చి అడగండి, మాకంటే ఎక్కువ: యనమల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా ఏపీ సర్కారు పైన ఆరోపణలు సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే తెలంగాణకు విద్యుత్ కష్టాలు అని కేసీఆర్ చెప్పడం శోచనీయమన్నారు.
కేసీఆర్, ఆయన ప్రభుత్వం వాస్తవాలను దాచి సభను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణనే ఎక్కువగా విద్యుత్ వాడుకుంటోందని చెప్పారు. కొన్ని ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి వాటా ఇవ్వడం లేదని చెప్పారు. సమస్యలు వస్తే ఇరు ప్రభుత్వాలు చర్చించుకోవాలన్నారు.
ఇలా అని చట్టంలో కూడా ఉందని చెప్పారు. జూరాల ప్రాజెక్టు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. జూరాల వంటి ప్రాజెక్టుల నుంచి ఏపీకు వాటా ఇవ్వడం లేదని, తమకంటే ఎక్కువ యూనిట్ల విద్యుత్ను వాడుకుంటోందన్నారు.
కొన్ని ప్రాజెక్టుల్లో ఏపీ నుంచి అధిక వాటా వాడుకుని ఇలా అభాండాలు వేస్తారా? అని ప్రశ్నించారు. వివాదాలు సృష్టించి లబ్ది పొందాలని తెరాస చూస్తోందని, ఇలాంటి ఆలోచనను మానుకోవాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.
ప్రతి సమస్యకు తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణం అంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణలోని సమస్యలకు చంద్రబాబు ఎలా కారణం అవుతారన్నారు. ఇరు రాష్ట్రాలకు మేలు తాము కోరుకుంటున్నామన్నారు. తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించారని, అందులో ఏపీ వాటా ఇచ్చారా అని యనమల ప్రశ్నించారు. జూరాల నుండి తమకు వాటా ఇస్తే, సీలేరు నుండి మీరు అడగవచ్చునని చెప్పారు.
రాజధాని నిర్మాణానికి తోడ్పడుతుంది: మంత్రి నారాయణ
సింగపూర్ పర్యటన ఏపీ రాజధాని నిర్మాణానికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని మంత్రి పీ నారాయణ మంగళవారం అన్నారు. పర్యటన ప్రధాన అజెండా పెట్టుబడుల ఆకర్షణే అన్నారు. చంద్రబాబుతో పాటు సింగపూర్ పర్యటనలో ఎంపీ రమేశ్ తదితరులు ఉన్నారు.