హరీష్ నేను రెడీ: నిజామబాద్లో కెసిఆర్Xపవన్ కళ్యాణ్
హైదరాబాద్/నిజామాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావులు సోమవారం నిజామాబాద్ జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు పది లక్షల రూపాయల వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పారు.
పేదలకు 125 గజాల స్థలంలో ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. తొలి విడతలో నిజామాబాదులో 5వేల ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. నిజామాబాదులో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నందున, వారి కోసం బీడి భవన్ నిర్మిస్తానని చెప్పారు. నిజామాబాదును అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తెరాస సెక్యులర్ పార్టీ అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తెలంగాణ యొక్క దుష్మన్ అన్నారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇచ్చామన్నారు. ఆంధ్రా వారితో ఇంకా కొట్లాట పూర్తి కాలేదన్నారు. నీళ్లు, నిధులు, ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పంపకం కూడా జరగాల్సి ఉందన్నారు. నరేంద్ర మోడీ అహంకారంతో, అజ్ఞానంతో ఉన్నారన్నారు. హైదరాబాదు ఓ ప్రాంతానికి చెందిన నగరం కాదని మోడీ చెప్పారన్నారు.
తెలుగుదేశం పార్టీ శవాన్ని భుజన వేసుకొని మోడీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఆంధ్రా ఓట్ల కోసం హైదరాబాదును రెండో రాజధానిగా చేస్తానని చెబుతున్నారన్నారు. హైదరాబాదులో చంద్రబాబు దొంగ ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. తన ఆస్తులను కాపాడుకునేందుకు మోడీతో చంద్రబాబు జత కట్టారన్నారు. మోడీ పిలిచి అడిగినా తాను మద్దతిచ్చేది లేదన్నారు.
నిజామాబాదులోనే పవన్
నిజామాబాద్ జిల్లాలో పవన్ బిజెపి తరఫున ప్రచారం నిర్వహించారు. బిసిలను తిట్టిన కెసిఆర్కు ఓటు ఎలా వేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కాంగ్రెసు హఠావో దేశ్ బచావో అని ఆయన నినదించారు. సామాజిక తెలంగాణ బిజెపితోనే సాధ్యమన్నారు. తాను తెలంగాణలోనే పుట్టానని, తెలంగాణ అంటే తనకు ఎనలేని అభిమానం అన్నారు. తాను కెసిఆర్ మాటలకు భయపడనని చెప్పారు.
హరీష్ రావుకు బొత్స సత్యనారాయణ ఎవరో తెలియదా అన్నారు. తాను చేసిన ఆరోపణలకు రుజువు చూపించేందుకు తాను సిద్ధమన్నారు. మోడీ ప్రధాని అయితే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. బిసిలపై దాడులు చేస్తే తమ ఉద్యమ స్వరూపాన్ని చూపిస్తామన్నారు. కెసిఆర్ బిసిల వ్యతిరేకి అన్నారు. షబ్బీర్ అలీ హఠావో.. కామారెడ్డి బచావో అని స్థానిక కాంగ్రెసు నాయకుడిపై మండిపడ్డారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు లాఠీ దెబ్బలు తిన్నారన్నారు.