29న టర్కీ జాతీయ దినోత్సవానికి కేసిఆర్కు ఆహ్వానం
హైదరాబాద్: టర్కీ కాన్సులేట్ జనరల్ మొరాక్ ఒబేరమల్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఆయనను టర్కీ జాతీయ దినోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెల 29న టర్కీ జాతీయ దినోత్సవాలు ఉన్నాయి దీనికి హాజరు కావాలని ఆయన కోరారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్ త్వరలో ఇస్తాంబుల్ వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా టర్కీ రాయబారి.. మీరు టర్కీ వస్తామంటే తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. దీనికి స్పందించిన కేసీఆర్.. తాను టర్కీని సందర్శించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నానని చెప్పారు. రాజధాని ఇస్తాంబుల్కు సంబంధించిన కొంత సాహిత్యాన్ని తమకు అందజేయాలని కేసీఆర్ ఆయనను కోరారు.
గోల్కొండకు వచ్చిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గోల్కొండ కోటను సందర్శించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సోమవారం గోల్కొండ కోటకు వచ్చిన కేసీఆర్ స్వయంగా కోటలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇవాళ ఉదయం పలువురు ఉన్నతాధికారులు గోల్కొండ కోటను పరిశీలించారు.