హైదరాబాద్ యుటి అంటే పోరు ఉధృతం: కెసిఆర్
హైదరాబాద్: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే పోరును ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆయన గురువారంనాడు హైదరాబాదులోని నాంపల్లిలో టిజీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణపై వెనక్కి వెళ్లేది లేదని ప్రధానే స్వయంగా చెప్పారని, ఇంత దూరం వచ్చాక ఆపుతామని సీమాంధ్ర నేతలు అనడం మూర్ఖత్వమని ఆయన అన్నారు. తెలంగాణ విజయ తీరాలకు చేరడం ఖాయమని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రకటన రాగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ విజయమ్మ రంగులు మార్చారని, మిమ్మల్ని పీక్కు తింటామని వారు చెబుతున్నారని, అందువల్ల తెలంగాణవాళ్లను అప్రమత్తం చేస్తోంది వారేనని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు ఢిల్లీకి యాత్రల మీద యాత్రలు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని, తెలంగాణను ఆపడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు. సీమాంధ్రకు నాలుగు లక్షల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇన్నేళ్లు నష్టపోయిన తెలంగాణవాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా రెండు సార్లు నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబూ విజయమ్మలూ రెండు రకాలుగా మాట్లాడుతున్నారని ఆన్నారు.
సీమాంధ్ర నేతలు విద్వేషాలు కలిగిస్తున్నారని, విషబీజాలు నాటుతున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమంలో ఒక నిర్మాణాత్మకమైన ప్రకటన కూడా రాలేదని, దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారని, ఎందుకు తగులబెడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఆపుతున్నారట కదా అని తనకు ఫోన్లు వస్తున్నాయని ఆయన అంటూ సీమాంధ్ర డబ్బాలు (టీవీ చానెళ్లు) చూడడం ఎందుకని అడిగారు. సీమాంధ్రలో రోజుకు నాలుగు వందల కెసిఆర్ దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారని, ఇదేనా కలిసి ఉందామనే నీతి అని ఆయన అన్నారు.
ప్రేమభావనతో విడిపోదామంటే తమ మేధావులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జెఎసి నేతలు ఉన్నారని అంటున్నారని ఆయన చెప్పారు. మాది కావాలి, మీది కావాలంటే ఎలా సమంజసమని ఆయన అన్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తెలంగాణ ప్రజలు విశ్రమించబోరని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో మేధావుల ఛాయ లేదని ఆయన అన్నారు. ఎవరు ఎలాంటి ప్రకటన చేసినా నమ్మవద్దని, తెలంగాణ ఏర్పడడం ఖాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications