సంతోషమే కానీ: కెసిఆర్, లగడపాటికి సన్మానం: హరీష్
హైదరాబాద్: తెలంగాణ నోట్ పైన హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేదాకా అప్రమత్తంగా ఉందామని తెలంగాణ ప్రజలకు గురువారం పిలుపునిచ్చారు. కేబినెట్ నోట్ ఆమోదం అనంతరం ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి పార్లమెటులో బిల్లును వెంటనే పెట్టాలని, బిల్లు పెట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తెలుగు మాట్లాడే వారు రెండు రాష్ట్రాలుగా ఉంటే నష్టమేమీ లేదని, సామరస్యంగా విడిపోదామని పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. కేబినెట్ నోట్కు ఆమోదం లభించడం కీలక ఘట్టమన్నారు.

కేబినెట్ నోట్ను స్వాగతిస్తున్నట్లు తెరాస ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. ఆలస్యమైనా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించడం, అధికారికంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం సంతోషం. కేంద్రానికి ధన్యవాదాలన్నారు. అయితే మంత్రివర్గ ఉప సంఘం, హైదరాబాద్ విషయంలోనూ తమకు స్పష్టత అవసరమన్నారు.
హైదరాబాద్లోని భూములు, చదువులు, పోలీసు శాఖ తదితరాలను గవర్నర్ పరిధిలోనో, కేంద్రం ఆధీనంలోనో పెడితే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణపై కేబినెట్ నోట్ వస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పాడని, అందుకు వేదికను తెలిపితే తాము కూడా వచ్చి సన్మానిస్తామని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications