జగన్ను మెచ్చుకోలేదు: కేఈ, బాబు మొండి: జేసీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అనుభవం ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సరిపోరని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శనివారం అన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబుపై తనకు అసంతృప్తి ఉందన్నది పత్రికల సృష్టే అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం సరికాదన్నారు. చంద్రబాబుతో తన స్నేహం ఇప్పటిది కాదని, 1972 నుంచి మంచి మిత్రులుగా ఒకే పార్టీలో కొనసాగుతున్నామన్నారు. అసెంబ్లీలో జగన్ ప్రసంగాన్ని తాను మెచ్చుకున్నానన్న వార్తలు పచ్చి అబద్ధమన్నారు.
అసెంబ్లీలో తానెప్పుడూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. గుంటూరు - విజయవాడ మధ్య నూతన రాజధాని ఏర్పాటుకు సంఘీభావంగా సంక్రాంతి తర్వాత లక్షమంది బీసీలతో విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సభకు చంద్రబాబు అనుమతి కూడా ఇచ్చారన్నారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నదుల అనుసంధానానికి చంద్రబాబుపై ఒత్తిడి తెస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని, ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తుంటే చంద్రబాబు ప్రజల్లో ప్రకాశిస్తున్నాడన్నారు.
రుణమాఫీ విషయంలో వైయస్ జగన్ చేస్తున్న ఆరోపణలను నమ్మేస్థితిలో రైతులు లేరని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వేరుగా అన్నారు. తాడిపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రైతుల రుణమాఫీ చేయడంలో శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నారన్నారు. కొన్ని పొరపాట్లు దొర్లివుండవచ్చునని, వాటిని త్వరలోనే సరిదిద్దుతారన్నారు.
వాస్తవ పరిస్థితులకు, అంచనాలకు ఎంతో వ్యత్యాసం వుంటుందన్నారు. రుణమాఫీ విషయంలో ఇన్ని కష్టాలు ఉంటాయని చంద్రబాబు ఊహించి ఉండరన్నారు. చంద్రబాబు అంచనా కొంతవరకు తప్పినప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసేంత వరకు విశ్రమించరన్నారు.
పింఛన్లలో కొందరికి అన్యాయం జరిగిందనడంలో కొంతవరకు వాస్తవం వుండవచ్చునన్నారు. లక్షల్లో పింఛన్లు మంజూరుచేసేటప్పుడు పొరపాట్లు జరగడం సహజమేనన్నారు. చంద్రబాబు మొండివాడు కావడం వల్లే తుఫాన్ వల్ల ఏర్పడ్డ ఇబ్బందులు, రాజధాని ఏర్పాటు విషయంలో ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు.












Click it and Unblock the Notifications