రాజధాని, విజయవాడ-గుంటూరు మధ్య: కేఈ హెచ్చరిక
హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూముల విలువ పెరగకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం చెప్పారు. గుంటూరు - విజయవాడ మధ్య భూముల రిజిస్ట్రేషన్లు జరగటం లేదని చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
రాజధాని ఏర్పాటు అయ్యే ప్రాంతంలో కృత్రిమ ధరలు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్లను నియంత్రించామన్నారు. రాజధాని ఏర్పాటు అయ్యే ప్రాంతంలో భూములకు ప్రభుత్వ ధర కంటే ఎక్కువ ఉంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 2013 భూసేకరణ చట్టంలో మార్పుకు కేంద్రాన్ని కోరుతామన్నారు.
కాగా, ఇప్పటి వరకు జరిగిన ఏడు విడతల భూ పంపిణీలో 54,016 మందికి 77,770 ఎకరాలు పంపిణీ చేసినట్లు కేఈ వెల్లడించారు. ఇరవై లక్షళ మంది లబ్ధిదారులకు 26 వేల ఎకరాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పట్టణాల్లో చెత్త నిర్వహణ సమస్యగా మారిందని, రెవెన్యూ శాఖలో సర్వేయర్ల కొరత ఉందన్నారు. త్వరలో 127 సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
కేంద్రమంత్రితో పత్తిపాటి భేటీ
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, విద్యుత్ అవసరాల నిమిత్తం రాష్ట్రానికి అదనంగా బొగ్గును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ను అందించాలని కోరారు. ప్రత్తిపాటి విజ్ఞప్తికి గోయల్ సానుకూలంగా స్పందించారని సమాచారం.