కాపు రిజర్వేషన్లు: చంద్రబాబుకు ఎదురు తిరిగిన కెఈ
కర్నూలు: కాపు రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత తెలుగుదేశం పార్టీ బీసీ నేతల నుంచి వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సోదరుడు కెఈ ప్రభాకర్ తాజాగా కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రతిపాదనను వ్యతిరేకించారు.
కాపులను బీసీ జాబితాలో చేర్చడానికి తాను పూర్తిగా వ్యతిరేకమని ఆయన చెప్పారు. టిడిపి ఆలోచనకు, ముద్రగడ పద్మనాభం దీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీకి ఆయన నాయకత్వం వహించారు. ఆయన ఈడిగ సామాజిక వర్గానికి చెందినవారు.
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బీసీల్లో చేర్చాలని అనుకుంటే, తమను ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో చేర్చాలనే వాల్మీకి, రజక, ఉప్పర, వడ్డెర సామాజిక వర్గాల డిమాండ్లను కూడా తీర్చాలని ఆయన అన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ను అంగీకరిస్తే రాష్ట్రంలో సంక్షోభం తలెత్తుతుందని ఆయన హెచ్చరించారు.
కులాల సామాజిక హోదాను బట్టి శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్లు ఉండాలని ఆయన అన్నారు. బీసీ సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న అక్రమాల వల్ల చాలా మంది బీసీలు రిజర్వేషన్లను వినియోగించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. చాలా మంది అగ్రవర్ణాల వారు బీసీ సర్టిఫికెట్లు సంపాదించి స్థానిక సంస్థల్లో రాజకీయ లబ్ధి పొందారని ఆయన ఆరోపించారు.