మాకు శత్రువులే: కేశినేని నాని సంచలనం, బీజేపీ పైనా?, కేవీపీ ఫ్రెండ్
విజయవాడ/న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టిడిపి ఎంపీ కేశినేని నాని శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాకు మోకాలడ్డే వారు ఎవరైనా తమకు శత్రువులేనని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి అన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన బిల్లుకు అనుకూలంగా తాము ఓటు వేస్తామని కేశినేని నాని చెప్పారు. బిల్లు ఎవరు పెట్టారన్న అంశంతో పని లేకుండా ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. అందుకే కేవీపీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఏపీ ప్రయోజనాల కోసం పోరాడే వారు ఎవరైనా తమకు మిత్రులేనని చెప్పారు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాకు మోకాలొడ్డే వారు తమకు శత్రువులన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి ఒనగూరే ప్రయోజనాలు ఏమీ లేవని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
కాగా, రాజ్యసభలో కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు పైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభలో గురువారం దాదాపు మూడు గంటల పాటు చర్చ జరిగింది. ఈ చర్చ శుక్రవారం మధ్యాహ్నం కొనసాగనుంది. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇవ్వనున్నారు.